ప్రభుత్వ చర్యలతోనే పోలవరం ఆలస్యం అవుతోందనడంలో అర్థంలేదు: మంత్రి అనిల్ కుమార్

  • నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి
  • నవంబర్ 1న పోలవరం పనుల పునఃప్రారంభం అంటూ వెల్లడి
  • 2021 నాటికి పోలవరం పూర్తిచేస్తామంటూ స్పష్టీకరణ
ఏపీలో భారీ ప్రాజక్టుగా పేరుగాంచిన పోలవరం సమస్యల్లో చిక్కుకున్నట్టే కనిపిస్తోంది. టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్ల కోసం ఏపీ సర్కారు ప్రయత్నాలు చేస్తోండగా, పోలవరం బాధ్యత ఇక రాష్ట్రానిదేనంటూ కేంద్రం చేతులు దులుపుకోవడం ప్రాజక్టు భవితవ్యాన్ని అనిశ్చితిలో పడేస్తోంది. దీనిపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. నెల్లూరులో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ చర్యలతోనే పోలవరం ఆలస్యం అవుతోందనడంలో అర్థంలేదని అన్నారు. పోలవరం ప్రాజక్టులో దోపిడీ నిర్మూలన కోసమే రివర్స్ టెండరింగ్ కు వెళుతున్నామని వివరించారు. పోలవరం పనులను నవంబర్ 1న పునఃప్రారంభిస్తామని వెల్లడించారు. సెప్టెంబరు వరకు పోలవరంలో ఎలాంటి పనులు జరగవని, ఆపై కొత్త కాంట్రాక్టర్లతో పనులు ప్రారంభిస్తామని మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. పారదర్శక విధానాలతో పనులు చేపట్టి 2021 నాటికి ప్రాజక్టు పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Anil Kumar Yadav
Polavaram
Andhra Pradesh
YSRCP

More Telugu News