కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారం షెడ్యూల్ వివరించిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
- ఈ నెల 24న నూతన గవర్నర్ గా బిశ్వభూషణ్ ప్రమాణస్వీకారం
- ముస్తాబవుతున్న రాజ్ భవన్
- ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్
తొలిసారిగా గవర్నర్ రాష్ట్రానికి వస్తున్నందున సైనిక వందనం ఉంటుందని, ఆపై ఆయన బెజవాడ దుర్గమ్మను దర్శించుకుంటారని సీఎస్ పేర్కొన్నారు. 23వ తేదీ రాత్రికి ఆయన రాజ్ భవన్ లో బస చేస్తారని, ఆ మరుసటి రోజున అధికారికంగా గవర్నర్ పదవీ ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ఇతర ఆహ్వానితులకు టీ పార్టీ ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఎల్వీ సుబ్రహ్మణ్యం వివరించారు. ఇక, సోమవారం నాటికి గవర్నర్ అధికారిక నివాసం పనులు పూర్తవుతాయని, డీజీపీ సూచనలతో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.