ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోతుంది: మాణిక్యాలరావు

  • 2024లో అధికారంలోకి రావడమే లక్ష్యం
  • పలువురు టీడీపీ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు
  • జగన్ ప్రభుత్వానిది కంటితుడుపు బడ్జెట్
బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తున్నామని ఆయన అన్నారు. తమ హైకమాండ్ ఆదేశాల కోసం వేచి చూస్తున్నామని... ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోతుందని చెప్పారు. టీడీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 20 లక్షల సభ్యత్వాలను నమోదు చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.

ఇదే సమయంలో జగన్ ప్రభుత్వంపై మాణిక్యాలరావు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని... కంటితుడుపు బడ్జెట్ గా ఉందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి, దానికి కారణమైన ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ అవినీతిపై ఆరోపణలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్... అవినీతిని వెలికి తీసి, చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా? అని సందేహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని... కరవు నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
Go Back to Shorts
Manikyala Rao
BJP
Telugudesam
YSRCP
Jagan

More Telugu News