గోదావరిలో పెరుగుతున్న వరద ఉద్ధృతి...ధవళేశ్వరం వద్ద 10.9 అడుగుల నీటి మట్టం
- నిన్న ఉదయానికి 10.7 అడుగులు
- ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు ఫలితం
- లక్షా 18 వేల క్యూసెక్కుల నీరు దిగువకు
ఎగువ నుంచి భారీగా వరద తరలి వస్తుండడంతో అధికారులు అదనపు నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. నిన్న ఉదయం 46,538 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు ఈరోజు ఉదయానికి నీటి విడుదలను లక్షా 18 వేల క్యూసెక్కులకు పెంచారు. వానాకాలం వచ్చినా గోదావరిలో జలకళ లేకపోవడంతో నిన్నమొన్నటి వరకు నిరాశతో ఎదురు చూసిన రైతుల ముఖాల్లో తాజా పరిస్థితి ఆనందాన్ని నింపుతోంది.
మరోవైపు పట్టిసీమ వద్ద గోదావరి నీటి మట్టం గణనీయంగా పెరిగింది. దీంతో పోలవరం ఎగువన ఉన్న 19 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు ఎగువన కాఫర్ డ్యాం వద్ద ప్రస్తుతం నీటి మట్టం గతంలో కంటే రెండు రెట్లు ఎక్కువ ఉంది. ప్రాజెక్టు నిపుణుల కమిటీ బుధవారం పనుల పరిశీలనకు రానుంది. ప్రస్తుత వరద పరిస్థితిలో అధికారులు ఎగువ కాఫర్ డ్యాం వరకు వెళ్లడం కష్టమే.