స్పీకర్ పదవి నాకు ఓ సవాల్: తమ్మినేని సీతారాం
- వ్యవస్థల పట్ల ప్రజల నమ్మకం పోకూడదు
- ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదు
- నా నిర్ణయాలను కోర్టులు సమీక్షించే పరిస్థితి ఏనాడూ రాకూడదు
తనను స్పీకర్ గా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈరోజు నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో శాసనసభలో పెద్దలు విశిష్ట సంప్రదాయాలు నెలకొల్పారని, వ్యవస్థల పట్ల ప్రజల నమ్మకం పోతే, ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని అన్నారు. తన నిర్ణయాలు కోర్టులు సమీక్షించాల్సిన పరిస్థితి ఏనాడూ రాకూడదని కోరుకుంటున్నానని చెప్పారు. సభా గౌరవంపై శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నామని, తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని, అవినీతి రహిత పాలన అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు. అనంతరం, రేపు ఉదయం తొమ్మిది గంటలకు శాసనసభను వాయిదా వేశారు.