Narendra Modi: పార్టీలో నన్ను మందలించగలవాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే అది ఆమె ఒక్కరే!: మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. పని పట్ల అంకితభావం చూపడంలో ఆమె తర్వాతే ఎవరైనా అని కితాబిచ్చారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. తాను ప్రధానమంత్రిగా అందరికీ తెలుసునని, కానీ తనను ఏ విషయంలోనైనా మందలించగలిగేవాళ్లు ఎవరైనా ఉన్నారా అంటే అది సుమిత్రా మహాజన్ మాత్రమేనని చెప్పారు. ఈ విషయం బీజేపీలో కొద్దిమందికి మాత్రమే తెలుసని అన్నారు.

లోక్ సభ స్పీకర్ గా 'తాయి' (ఆమెను నియోజకవర్గంలో ప్రజలు ముద్దుగా పిలుచుకునే పేరు) తన విధులను ఎంతో నైపుణ్యంతో, నియంత్రణతో నిర్వర్తించారని కితాబిచ్చారు. ప్రజల మనస్సులపై చెరగని ముద్రవేశారని మోదీ పేర్కొన్నారు. బీజేపీలో తాయితో కలిసి పనిచేశానని, ఇండోర్ సిటీలో జరిగిన అభివృద్ధి చూస్తుంటే ఆమె తాను ఏంచేయాలనుకున్నారో అన్నింటినీ సాకారం చేసుకున్నట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

76 ఏళ్ల సుమిత్రా మహాజన్ ఇప్పటికి ఎనిమిదిసార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. అయితే, బీజేపీ అధినాయకత్వం తీసుకువచ్చిన వయసు నిబంధన కారణంగా ఈసారి స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారు.
Narendra Modi

More Telugu News