వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. చెట్టును ఢీకొన్న బైక్.. ముగ్గురు విద్యార్థుల దుర్మరణం

  • వరంగల్ రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా ఘటన
  • పంథిని వద్ద అదుపు తప్పిన బైక్
  • ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు
విద్యార్థులు ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని పంథిని గ్రామం సమీపంలో బుధవారం జరిగిన ఈ ఘటన మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన మామిండ్ల ఆదిత్య (20), బిక్కినేని మురళీధర్‌రావు, ఇల్లందుకు చెందిన గొడిశాల రాంసాయి స్నేహితులు. ఆదిత్య వరంగల్‌లోని వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతుండగా, మురళీధర్‌రావు, రాంసాయి పాల్వంచలో డిప్లొమా చేస్తున్నారు. ఇటీవల ఇంటికి వచ్చిన రాంసాయి, మురళీధర్‌రావు తిరిగి రైలులో పాల్వంచ వెళ్లేందుకు సిద్ధమయ్యారు.  

దీంతో తమను వరంగల్ రైల్వే స్టేషన్‌లో వదిలిపెట్టాలంటూ వారు కోరడంతో ఆదిత్య సరేనని బైక్ తీసుకొచ్చాడు. ముగ్గురూ కలిసి వరంగల్ బయలుదేరారు. పంథిని సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆదిత్య, రాంసాయిలు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మురళీధర్‌రావు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Warangal Rural District
Road Accident
Telangana
students

More Telugu News