రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు తప్పవు: కేసీఆర్

  • ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్‌గా కోవా లక్ష్మి పేరు ఖరారు
  • సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించిన కేసీఆర్
  • మండల పరిషత్ బాధ్యతలు ఎమ్మెల్యేలకు అప్పగింత
రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు తప్పవని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నేడు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్‌గా కోవా లక్ష్మి పేరును ఖరారు చేసిన కేసీఆర్, మిగతా స్థానాలకు సంబంధించిన పేర్లను తరువాత ఖరారు చేయనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలను గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు.

అలాగే రాష్ట్రంలో మొత్తం 32 జడ్పీ, 530కి పైగా మండల పరిషత్ స్థానాలను కైవసం చేసుకోవాలని నాయకులకు సూచించారు. జిల్లా పరిషత్‌లకు సంబంధించి సీనియర్ నేతలకు, మండల పరిషత్‌లకు సంబంధించి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. రెవెన్యూ వ్యవస్థ రద్దుకు సంబంధించి సీనియర్ నేతల అభిప్రాయాలను కేసీఆర్ సేకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవస్థలో చాలా లోపాలున్నాయని, వాటి స్థానంలో కొత్త చట్టం తీసుకురావడం మంచిదని నేతలు సూచించినట్టు తెలుస్తోంది. జిల్లా, మండల పరిషత్ ఏర్పాట్లన్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని కేసీఆర్ నేతలకు సూచించారు.
Go Back to Shorts
KCR
Kova Lakshmi
Telangana Bhavan
TRS
Revenue Department

More Telugu News