Andhra Pradesh: మోదీ రూ.2 వేల నోటును తేవడంతో రాజకీయాలు నీచంగా తయారయ్యాయి!: సీఎం చంద్రబాబు

రాజ్యాంగం ఉన్నంత వరకు డా.బీఆర్ అంబేద్కర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు అంబేద్కర్ రాజ్యాంగంలో పరిష్కారాలను చూపారని వ్యాఖ్యానించారు. దేశ ప్రజల చేతికి కత్తి ఇవ్వకుండా.. ఓటు హక్కు ఇచ్చినట్టు చెప్పారన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఈరోజు జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

దేశసంపదను కొంతమంది లూటీ చేసి దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసి రూ.2 వేల నోటును మోదీ తెచ్చారనీ, దీంతో రాజకీయాలు నీచంగా తయారయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 25 లక్షల ఓట్లు తొలగించి క్షమాపణలు చెప్పారనీ, ప్రజాస్వామ్యానికి క్షమాపణ చెబితే సరిపోతుందా? అని నిలదీశారు.

వీవీప్యాట్ స్లిప్పులను 50 శాతం లెక్కించాలని మరోసారి చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రధానిగా ఉండేందుకు ఎన్ని తప్పులైనా చేస్తామనే విధంగా మోదీ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఓటేసే సమయంలో దేశ ప్రజలంతా పునరాలోచించాలని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు సుజనా చౌదరి, కళా వెంకట్రావు, జూపూడి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Narendra Modi

More Telugu News