టీడీపీ కనుమరుగవుతుంది... సిట్టింగ్ ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో ఓడిపోనున్నారు: జీవీఎల్

  • చంద్రబాబు విశ్వసనీయతను కోల్పోయారు
  • గతంలో కంటే బీజేపీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుంది
  • రాష్ట్రంలో ధనిక రాజకీయాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి
ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో టీడీపీ కనుమరుగవుతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని... చంద్రబాబు విశ్వసనీయతను కోల్పోయారని వ్యాఖ్యానించారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో ఓడిపోనున్నారని అన్నారు. శాసనసభకు సంబంధించి ప్రాంతీయ పార్టీలకు ఓటు వేసినా... పార్లమెంటుకు వచ్చేసరికి బీజేపీ అభ్యర్థులకు ఓటు వేశారని చెప్పారు.

ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడుతుందని... ఆ శూన్యతను బీజేపీ భర్తీ చేస్తుందని జీవీఎల్ తెలిపారు. గతంలో కంటే బీజేపీ ఎక్కువ స్థానాలను గెలుపొందుతుందని చెప్పారు. చంద్రబాబు ఒక స్టాండ్ లేని నాయకుడని... కేసీఆర్, జగన్ విధానాలను కాపీ కొట్టారని విమర్శించారు. పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు బీహార్ ను మించిపోయాయని అన్నారు. ధనిక రాజకీయాలు రాష్ట్రంలో ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని చెప్పారు. ఎన్నికల సంఘం మరికొంతమంది సిబ్బందిని నియమించుకుని ఉంటే... పోలింగ్ సజావుగా సాగేదని అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
gvl narasimharao
Chandrababu
jagan
kcr

More Telugu News