Virat Kohli: తప్పులు చేసినందునే ఈ పరిస్థితి: విరాట్ కోహ్లీ

  • వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిన కోహ్లీ సేన
  • సోషల్ మీడియాలో వాపోతున్న అభిమానులు
  • తరువాతి మ్యాచ్ లు గెలుస్తామన్న కోహ్లీ
విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి విధ్వంసక ఆటగాళ్లు ఉండి కూడా, ఈ ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇంతవరకూ బోణీ కొట్టలేదు. తాము ఆర్సీబీ అభిమానులమని చెప్పుకునే పరిస్థితి లేదని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాపోతున్న వేళ, తనలో ఆత్మవిశ్వాసం ఏ మాత్రం చెక్కు చెదరలేదన్నట్టుగా మాట్లాడాడు కోహ్లీ.

 నిన్నటి మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ సీజన్ లో ఇప్పటివరకూ పాయింట్ల ఖాతాను తెరవలేకపోవడంపై స్పందించాడు. ఇవి సర్వసాధారణమేనని, ప్రారంభం బాగాలేనంత మాత్రాన నిరాశ పడాల్సిన అవసరం లేదని అన్నాడు. నిన్నటి మ్యాచ్ లో తాము గట్టి పోటీ ఇచ్చామని, మరో 20 పరుగులు చేసివుంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నాడు. కొన్ని తప్పులు చేసినందునే గెలుపు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డ కోహ్లీ, తదుపరి మ్యాచ్ కి ముందు ఆటగాళ్లం అందరమూ కూర్చుని చర్చించుకుంటామని, తనలో పోరాట పటిమ ఇంకా మిగిలే వుందని అన్నాడు. వ్యూహాలు రచించి విజయాన్ని సాధిస్తామని, తదుపరి మ్యాచ్ లను గెలుస్తామన్న నమ్మకం ఉందని చెప్పాడు.

More Telugu News

Virat Kohli
Match
IPL
RCB