ఏలూరు లోక్ సభ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కల్యాణ్

జనసేన పార్టీ తరఫున ఏలూరు లోక్ సభ స్థానంలో పోటీచేసే అభ్యర్థిగా డాక్టర్ పెంటపాటి పుల్లారావు పేరును ప్రకటించారు. శనివారం రాత్రి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజయవాడ కార్యాలయంలో ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, పెంటపాటి పుల్లారావు గురించి అనేక విషయాలు చెప్పారు. పుల్లారావు గారు గతంలో గిరిజనుల కోసం, పర్యావరణ సమస్యలపైనా పోరాడిన తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు.

నేడు రూ.50 కోట్లు పెడితే ఎంపీ అయిపోవచ్చని అందరూ వస్తున్నారని, కానీ తాను నమ్మిన విలువల కోసం వస్తున్న పెంటపాటి పుల్లారావు వంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. పుల్లారావుగారు ఎక్కువ భాగం విదేశాల్లోనే చదువుకున్నా మన సంస్కృతి, సంప్రదాయాలపై ఎంతో గౌరవం ఉన్న వ్యక్తి అని పవన్ కల్యాణ్ కొనియాడారు. కాగా, గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ జియావుర్ రెహమాన్ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.


More Telugu News