చంద్రబాబుతో మాజీ మంత్రి బొజ్జల భేటీ .. ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటన!

  • కుమారుడు సుధీర్ కు టికెట్ ఇవ్వాలని చంద్రబాబుకు విజ్ఞప్తి
  • రంగంలోకి బొజ్జల సోదరుడు, ఎన్సీవీ నాయుడు
  • చంద్రబాబు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
కడప టీడీపీలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య రాజీ కుదిర్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు ఇప్పుడు మరో తలనొప్పి ఎదురైంది. ఈరోజు చంద్రబాబును టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కలుసుకున్నారు. అనారోగ్యం కారణంగా రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని టీడీపీ అధినేతకు తెలుపుతూ, తనకు బదులుగా తన కుమారుడు సుధీర్ కు శ్రీకాళహస్తి సీటును కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.

అయితే బొజ్జల సోదరుడు హరినాథ రెడ్డి, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు కూడా శ్రీకాళహస్తి టికెట్ కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. అంతేకాకుండా బొజ్జల పోటీలో ఉంటేనే తామంతా ఆయనకు మద్దతు ఇస్తామనీ, లేదంటే తమ దారి తాము చూసుకుంటామని పలువురు టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో శ్రీకాళహస్తి సీటు విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారోనని అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Go Back to Shorts
Andhra Pradesh
Chandrababu
Bojjala Gopala Krishna Reddy
Telugudesam

More Telugu News