కర్నూలు వాణిజ్య పన్నుల అసిస్టెంట్ కమిషనర్ పై ఏసీబీ దాడులు!

  • నాగేంద్ర ప్రసాద్ ఇళ్లు, ఆఫీసులో సోదాలు
  • పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
  • హైదరాబాద్, తిరుపతి, కర్నూలులో తనిఖీలు
కర్నూలు వాణిజ్య పన్నుల అసిస్టెంట్ కమిషనర్ నాగేంద్ర ప్రసాద్ ఇంటిపై ఈరోజు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో నాగేంద్ర ప్రసాద్ ఇంటితో పాటు ఆఫీసులో ఈరోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. అలాగే కర్నూలు, హైదరాబాద్, తిరుపతిలోని ఆయన బంధువుల నివాసాల్లోనూ తనిఖీలు చేపట్టారు.

ఈ విషయమై ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. నాగేంద్రప్రసాద్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. అందువల్లే పలు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నామన్నారు.

తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకూ రూ.1.5 కోట్ల నగదు, అర కిలో వెండి, 600 గ్రాముల బంగారాన్ని గుర్తించామని పేర్కొన్నారు. అనంతపురంలో పలు ఇళ్లతో పాటు కర్నూలులో భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
Go Back to Shorts
Andhra Pradesh
acb
Kurnool District
assistent commisinor

More Telugu News