గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగన్.. ఫొటోలు విడుదల చేసిన వైసీపీ!
- హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో వేడుకలు
- హాజరైన నేతలు, వైసీపీ కార్యకర్తలు
- జాతీయ నేతలకు నివాళులు అర్పించిన జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. తొలుత పార్టీ ప్రధాన కార్యాలయంలోని మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ వంటి జాతీయ నేతల చిత్రపటాలకు జగన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నేతలు, పార్టీ కార్యకర్తల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ అక్కడి నుంచి ముందుకెళ్లారు.
త్వరలోనే ‘సమరశంఖారావం’ పేరుతో వైసీపీ బూత్ స్థాయి కమిటీలు, కార్యకర్తలను జగన్ కలుసుకోనున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 4న చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి ఈ పర్యటన మొదలుకానుంది. ఈ సమావేశాల్లో పార్టీ పటిష్టతపై జగన్ ప్రధానంగా దృష్టి సారించనున్నారు.