గజ్వేలు ఫలితాన్ని చెప్పని లగడపాటి.. తాను నమ్మేది ఆ రెండింటినేనన్న మాజీ ఎంపీ

  • వ్యక్తిగత వివరాలు చెప్పలేను
  • గజ్వేల్‌లో గెలుపు ఎవరిదో మీ ఊహకే
  • యాక్సిస్, టుడేస్ చాణక్యలను నమ్ముతా
తెలంగాణ ఎన్నికలపై తాను నిర్వహించిన సర్వే వివరాలను విడుదల చేసిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. ప్రజాకూటమి విజయం ఖాయమని తేల్చేశారు. పూర్తి వివరాలను మాత్రం రెండు రోజుల్లో విడుదల చేస్తానని చెప్పారు. ఎన్నికలకు ముందు లగడపాటి మాట్లాడుతూ.. పోలింగ్ శాతం పెరిగితే టీఆర్ఎస్‌కు దెబ్బేనని పేర్కొన్నారు. ఈ విషయాన్ని విలేకరులు ప్రస్తావిస్తూ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బరిలో ఉన్న గజ్వేల్‌లో 88 శాతం పోలింగ్ నమోదైందని, మరి అక్కడ కేసీఆర్ ఓడిపోబోతున్నారా? అని ప్రశ్నించారు.

విలేకరుల ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు లగడపాటి నిరాకరించారు. వ్యక్తిగత వివరాలు చెప్పబోనన్నారు. గజ్వేల్‌లో ఎటువంటి ఫలితం రాబోతోందో మీ ఊహకే వదిలేస్తున్నానని పేర్కొన్నారు. గజ్వేల్‌ ఫలితంపై కానిస్టేబుల్ తనతో చెప్పింది నిజం కాబోతోందా? అన్న ప్రశ్నకు సమాధానం వచ్చి కూడా మూడు నెలలైందన్నారు. ఆ తర్వాత రాజకీయంగా చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయని, ప్రజల్లో బ్రహ్మాండమైన మార్పు వచ్చిందని లగడపాటి పేర్కొన్నారు.

 ఇక, జాతీయ చానళ్లు విడుదల చేసిన సర్వే వివరాల గురించి విలేకరులు ప్రస్తావించినప్పుడు ఉత్తరాది వారు దక్షిణాదిలో పరిస్థితులను సక్రమంగా అంచనా వేయలేరని, అందుకనే ఇప్పటి వరకు వారు చెప్పిన సర్వేలు దక్షిణాదిలో నిజం కాలేదన్నారు. ఉత్తర భారతదేశంలో తాను రెండే రెండు సర్వేల సంస్థలను నమ్ముతానని,  వాటిలో ఒకటి యాక్సిస్ కాగా, రెండోది టుడేస్ చాణక్య అని పేర్కొన్నారు. ఈ రెండు సంస్థలు కూడా ఉత్తరాదిన కరెక్ట్‌గానే అంచనా వేస్తున్నా, దక్షిణాదిన మాత్రం విఫలమవుతున్నాయన్నారు. తన వద్ద నున్న సమాచారాన్ని కూడా వారితో పలుమార్లు పంచుకున్నట్టు లగడపాటి వివరించారు.
Go Back to Shorts
Lagadapati Rajagopal
Survey
todays chanakya
Axis
Gajwel
KCR

More Telugu News