రికార్డులకెక్కిన హిమాచల్‌ప్రదేశ్.. ఇక అన్నింటికీ ఒకే హెల్ప్‌లైన్ నంబరు

  • అన్ని సేవలకు ఒకే నంబరు
  • బుధవారం ప్రారంభించిన హిమాచల్‌ప్రదేశ్
  • మొబైల్ యాప్ కూడా ప్రారంభం
ఎమర్జెన్సీ సర్వీసులన్నింటికీ ఒకే నంబరును ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా హిమాచల్‌ప్రదేశ్ రికార్డులకెక్కింది. ఇకపై ఎటువంటి అత్యవసర సహాయం కావాలన్నా 112 నంబరుకు కాల్ చేస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు ఒక్కో విభాగానికి ఉన్న ఒక్కో నంబరును తొలగించిన ప్రభుత్వం ఈ నంబరును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రాజధాని సిమ్లాలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్‌సీ)ని ఏర్పాటు చేసింది. ఇందులోనే 12 జిల్లాల కమాండ్ సెంటర్లు (డీసీసీలు) ఉంటాయని హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈఆర్‌సీలో పోలీస్ (100), అగ్నిమాపక (101), ఆరోగ్యం (108), మహిళా రక్షణ (1090) కలిసి ఉంటాయి. అత్యవసర సమయాల్లో వీటిలో ఏ ఒక్క సాయం అవసరమైనా 112 నంబరుకు కాల్ చేస్తే సరిపోతుంది. అమెరికాలోనూ ఇటువంటి సేవలే అందుబాటులో ఉన్నాయి. 911 నంబరుకు కాల్ చేయడం ద్వారా అవసరమైన సాయం పొందవచ్చు. ఇప్పుడు హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రారంభించిన 112 నంబరు దీనిని పోలి ఉంది. ఈ సేవలకు సంబంధించి ‘112 ఇండియా’ అనే మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించారు. ఇందులో ఓ ప్యానిక్ మీట ఉంటుంది. దీనిని నొక్కడం ద్వారా అత్యవసర సేవలు పొందవచ్చు.
Go Back to Shorts
Himachal Pradesh
emergency number
112
ERC
112 India

More Telugu News