అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తే దేశం తగలబడి పోతుందా?: ఆరెస్సెస్

  • సుప్రీంకోర్టుపై విరుచుకుపడిన ఆరెస్సెస్ నేత
  • హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని మండిపాటు
  • ఆర్డినెన్స్ ఒక్కటే మార్గమన్న ఇంద్రేష్ కుమార్
అయోధ్యలో రామ మందిర  నిర్మాణంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) సంచలన వ్యాఖ్యలు చేసింది. అయోధ్యలో రామ మందిరం నిర్మించినంత మాత్రాన దేశం ఏమీ తగలబడిపోదని పేర్కొంది. రామ మందిర వివాదం విషయంలో సుప్రీం కోర్టు కావాలనే ఆలస్యం చేస్తోందని మండిపడింది. ఆయోధ్య భూ వివాదం కేసును ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ వాయిదా వేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని వ్యాఖ్యానించింది.

విచారణను  ఆలస్యం చేసి రాజ్యాంగాన్ని అవమానపరుస్తోందని ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ ఆరోపించారు. ‘‘వారి పేర్లు నేను చెప్పాల్సిన పనిలేదు. 125 కోట్ల మందికి వారి గురించి తెలుసు. ముగ్గురు జడ్జిల బెంచ్ విచారణను ఆలస్యం చేస్తోంది. వారు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తూ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.

ఇది కోట్లాదిమంది విశ్వాసానికి సంబంధించిన విషయమని, ఇప్పుడు తామెవరిపై నమ్మకం పెట్టుకోవాలని ప్రశ్నించారు. ఇప్పుడున్న ఒకే ఒక్క ఆశ ప్రభుత్వం మాత్రమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. అయితే ఎన్నికల నేపథ్యంలో డిసెంబరు 11 వరకు మోడల్ కోడ్ అమల్లో ఉండడంతో అప్పటి వరకు ప్రభుత్వం చేతులు కట్టుకుని ఉండడం తప్ప మరేమీ చేయలేదని ఇంద్రేష్ కుమార్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Burn
Ayodhya
Indresh Kumar
RSS
Constitution
Supreme Court

More Telugu News