యూపీలో జైలులో మందేసి ఎంజాయ్ చేసిన ఖైదీలు, బెదిరింపు ఫోన్ కాల్స్.. ఆరుగురు అధికారులపై వేటు

  • రాయ్‌బరేలీ జైలులో మందేస్తూ ఎంజాయ్ చేసిన ఖైదీలు
  • వ్యాపారికి జైలు నుంచే బెదిరింపులు
  • వైరల్ అయిన వీడియో
ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి జైలులో ఖైదీలు వ్యవహరించిన తీరు వైరల్ అవుతోంది. జైలులో మందేసి ఎంజాయ్ చేస్తూ కనిపించిన ఖైదీలు బయటకు ఫోన్ చేసి బెదిరింపు కాల్స్ చేయడం కనిపించింది. ఇప్పుడీ వీడియో బయటకు వచ్చి వైరల్ అయింది. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు ఆరుగురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు.

షూటర్లు షోహ్రబ్, అన్షు దీక్షిత్‌లు మరో నలుగురితో కలిసి జైలు బ్యారక్‌లో మందు తాగుతూ పార్టీ చేసుకోవడం కనిపించింది. పక్కనే మాంసం ముక్కలు, బులెట్లు కూడా వీడియోలో స్పష్టంగా కనిపించాయి. అంతేకాదు, జైలు గది నుంచి ఓ వ్యాపారికి ఫోన్ చేసి డబ్బుల కోసం బెదిరించారు. జైలర్ ఇంటికి వెళ్లి రూ. 10 వేలు ఇవ్వాలని, డిప్యూటీ జైలర్‌కు రూ. 5 వేలు ఇవ్వాలని వ్యాపారిని బెదిరించడం స్పష్టంగా వినిపిస్తోంది. అంతేకాదు, జైల్లోకి మద్యం, ఇతర వస్తువులు తీసుకురావాలని దీక్షిత్ ఫోన్‌లో బెదిరించాడు.

వీడియో బయటకు వచ్చి వైరల్‌గా మారడంతో రాయ్‌బరేలీ జిల్లా జైలు సీనియర్ సూపరింటెండెంట్ ప్రమోద్ కుమార్ సహా మొత్తం ఆరుగురిని సస్పెండ్ చేసినట్టు ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ తెలిపారు. అలాగే, జైలులోకి మొబైల్ ఫోన్లు, మద్యం, సిగరెట్లు, ఆహారపదార్థాలు ఎలా వెళ్లాయనే దానిపై డిపార్ట్‌మెంట్ ఎంక్వైరీకి ఆదేశించినట్టు తెలిపారు.
Go Back to Shorts
Viral Videos
extortion
Raebareli
social media
Uttar Pradesh

More Telugu News