షార్టులు వేసుకుని, ఇంగ్లిష్ మాట్లాడే భార్య నాకొద్దు.. విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన కలెక్టర్!
- బిహార్ లోని పాట్నాలో ఘటన
- 2015లో వివాహం చేసుకున్న ధర్మేంద్ర
- మూడేళ్లకే పెటాకులైన పెళ్లి
2013 ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన ధర్మేంద్ర కుమార్ జామూయి జిల్లా మెజిస్ట్రేట్ (కలెక్టర్)గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2015, మార్చి 11న పాట్నాకు చెందిన యువతి వత్సలను వివాహం చేసుకున్నారు. వివాహం సమయంలో ఆమె చదువుకుంటూ ఉండటంతో పెళ్లికాగానే కొద్దికాలం ఢిల్లీలో చదువును పూర్తిచేసి భర్తవద్దకు తిరిగివచ్చింది. కొత్తల్లో అంతా బాగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ధర్మేంద్ర కుమార్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కాడు.
ఇంగ్లిష్ లో మాట్లాడుతూ వత్సల తనను అవమానిస్తోందనీ, పొట్టిపొట్టి బట్టలు వేసుకుని వీధుల్లో తిరుగుతోందని ఆరోపించాడు. తాను ఎంతగా నచ్చజెప్పినా వినడం లేదని వాపోయాడు. మరోవైపు తన భర్త చెప్పేది వాస్తవం కాదని వత్సల తెలిపింది. కాపురంలో గొడవలపై మాట్లాడేందుకు తాను తల్లితో కలిసి ఇంటికిరాగా గార్డులు అడ్డుకున్నారని పేర్కొంది. ధర్మేంద్ర కుమార్ తనకు అన్యాయం చేస్తున్నారనీ, ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేసింది. మరోవైపు ఈ వివాదాన్ని కోర్టులోనే తేల్చుకుంటానని ధర్మేంద్ర ప్రకటించారు.