New Delhi: బయటకు రాగానే కేజ్రీవాల్ ను గన్ తో కాల్చేస్తా: కారంపొడి నిందితుడి సంచలన ప్రకటన
నిన్న మధ్యాహ్నం సచివాలయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై కారంపొడితో దాడి చేసి సంచలనం రేపిన నిందితుడు, తాను జైలు నుంచి బయటకు వచ్చాక కేజ్రీవాల్ ను గన్ తో కాల్చేస్తానని హెచ్చరించాడు. కేజ్రీవాల్ ను హతమార్చడమే తన ధ్యేయమని అతను అరిచాడని ఘటనా స్థలంలోనే ఉన్న అధికారులు వెల్లడించారు. కాగా, కేజ్రీవాల్ కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినట్టు వచ్చిన అనిల్ కుమార్ శర్మ (40), ఆయన కళ్లజోడు లాగి, కళ్లల్లో కారం కొట్టినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అనిల్ ను విచారిస్తున్నారు. ఆయన్ను నేడు కోర్టు ముందు హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి.