గెలిపించే బాధ్యత మాదే.. హరికృష్ణ కూతురు సుహాసినికి చంద్రబాబు, బాలకృష్ణ అభయం!

  • అనూహ్యంగా తెరపైకి వచ్చిన నందమూరి సుహాసిని
  • కూకట్ పల్లి నుంచి నిలపాలని భావిస్తున్న టీడీపీ
  • సుహాసినితో మాట్లాడిన చంద్రబాబు, బాలయ్య
  • పెద్దిరెడ్డిని బుజ్జగించే పనిలో అధిష్ఠానం
తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అసెంబ్లీ స్థానాల్లో ఒకటైన కూకట్ పల్లి నియోజకవర్గానికి మహా కూటమి తరఫున అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు నందమూరి సుహాసిని. ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా రాజకీయాల్లోకి రావాలని తొలుత హరికృష్ణ కుమారుడు కల్యాణ్ రామ్ కు టీడీపీ ఆఫర్ ఇచ్చినా, ఆయన నిరాకరించడంతో ఆ చాన్స్ ను తీసుకోవాలని సుహాసినిని కోరారు తెలంగాణ టీడీపీ పెద్దలు.

ఇక ఇదే విషయాన్ని ఈ ఉదయం చంద్రబాబునాయుడి ముందు ఉంచిన టీటీడీపీ, ఆమెను నిలపాలని కోరగా, చంద్రబాబు, సుహాసిని బాబాయ్ బాలకృష్ణలు స్వయంగా ఆమెతో మాట్లాడినట్టు తెలుస్తోంది. కూకట్ పల్లిలో తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో ఎంతో బలముందని, నిలబడితే, గెలిపించే బాధ్యత తమదేనని ఆమెకు అభయమిచ్చినట్టు సమాచారం.

ఈ విషయంలో సుహాసిని ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించనప్పటికీ, ఈ స్థానం నుంచి తానే పోటీ చేస్తానని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఘంటాపథంగా చెబుతున్నట్టు తెలుస్తోంది. పెద్దిరెడ్డిని బుజ్జగించే పనిని ఎల్.రమణకు అప్పగించిన టీడీపీ అధిష్ఠానం, ఆయనకు మరో విధంగా అవకాశం ఇస్తామని చెబుతోంది.
Go Back to Shorts
Nandamuri Suhasini
Telugudesam
Telangana
Chandrababu
Kukatpalli
Balakrishna

More Telugu News