గవర్నర్ కు నివేదిక అందజేసిన పవన్ కల్యాణ్

ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కలిశారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో ఈరోజు సాయంత్రం నరసింహన్ ను కలిసి శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను నష్టంపై తమ పార్టీ రూపొందించిన నివేదికను అందజేశారు.

అనంతరం, మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఉద్దానంలో నష్టం తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో బయటకు చూపించలేదనే ఆవేదన అక్కడి ప్రజల్లో ఉందని అన్నారు. ప్రజల్లో ఉన్న స్పందననే గవర్నర్ కు నివేదిక రూపంలో అందజేశామని చెప్పారు. అక్కడ గతంలో ఉన్న పరిస్థితి రావాలంటే కనీసం పదిహేను నుంచి ఇరవై ఏళ్లు పడుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పవన్ స్పందిస్తూ, చాలా సంతోషంగా ఉన్నామని, కోర్టు ఆదేశాలను గౌరవించి ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కోరారు.


More Telugu News