మ్యాచ్‌ ఫిక్సింగ్‌పై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన పాకిస్థాన్‌ క్రికెటర్‌ కనేరియా

  • నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని కోరుకుంటున్నా
  • బుకీతో కలిసి తప్పు చేసినందుకు భారీ మూల్యం చెల్లించుకున్నా
  • ఆరేళ్ల నుంచి చెబుతూ వస్తున్న అబద్ధాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతున్నా
మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో జట్టులో స్థానం కోల్పోవడమేకాక నిషేధానికి గురైన పాకిస్థానీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా ఎట్టకేలకు చేసిన తప్పును అంగీకరించాడు. 61 టెస్టుల్లో 261 వికెట్లు తీసిన ఈ పాకిస్థానీ స్పిన్నర్‌ తన స్పిన్‌ మాయాజాలంతో సొంత జట్టుకు ఎన్నో విజయాలు అందించి పెట్టాడు. 2010లో తన చివరి టెస్టు ఆడాడు. కనేరియా స్పాట్‌ ఫిక్సింగ్‌ కు పాల్పడినట్టు ఇంగ్లండ్‌ క్రికెట్ బోర్డు నిర్ధారించడంతో అతనిపై జీవితకాల నిషేధం విధించగా, ఎసెక్స్‌ జట్టులో కనేరియా సహచరుడు మెర్విన్‌ వెస్ట్‌ఫీల్డ్‌ను జైలుకు పంపింది.

 ఫిక్సింగ్‌ ఆరోపణలపై ఇన్నాళ్లు కనేరియా రకరకాల వాదనలు వినిపిస్తూ వచ్చినా ఎట్టకేలకు తప్పు అంగీకరించాడు. ‘ఆరేళ్లుగా ఏవేవో అబద్ధాలు చెబుతూ నెట్టుకు వచ్చాను. దీనివల్ల మానసికంగా ఎంతో భారాన్ని అనుభవిస్తున్నాను. నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని ఇప్పుడు తెచ్చుకున్నాను. నేను చాలా పెద్ద తప్పుచేశాను. అప్పుడున్న పరిస్థితుల్లో నా పరిస్థితిని అర్థం చేసుకుని క్షమించమని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు, అభిమానులు, ప్రజల్ని కోరుతున్నాను’ అంటూ ప్రాధేయపడ్డాడు.

'బుకీ అనుభట్‌తో కలిసి చాలా పెద్ద తప్పు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అనుభట్‌కు దగ్గరవ్వడమే నేను చేసిన పెద్ద పొరపాటు, ఇలాంటి తప్పిదాలకు తావివ్వవద్దని యువ ఆటగాళ్లకు చెప్పడమే ఇకపై క్రికెట్‌కు నేను చేసే సేవ' అని కనేరియా పేర్కొన్నాడు. 2010 ఇంగ్లండ్ పర్యటనలోనే సల్మాన్‌ భట్‌, మహ్మద్‌ ఆసిఫ్‌, మహ్మద్‌ ఆమిర్‌ స్ఫాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి ఐదేళ్ల నిషేధానికి గురయ్యారు.
Go Back to Shorts
danish kaneria
pakistan cricketer
spoke out about fixing

More Telugu News