- ముంబై ఎయిర్ పోర్టులో ఘటన
- తీవ్ర గాయాలపాలైన ఎయిర్ హోస్టెస్
- నానావతి హాస్పిటల్ కు తరలింపు
ముంబైలో టేకాఫ్ కు సిద్ధమైన ఓ ఎయిర్ ఇండియా విమానం డోర్ ను మూసే క్రమంలో ఎయిర్ హోస్టెస్ ప్రమాదవశాత్తూ కిందపడి తీవ్ర గాయాలపాలైంది. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి, న్యూఢిల్లీకి బయలుదేరిన ఏఐ 864లో ఈ ఘటన నేటి ఉదయం జరిగింది. విమానం డోర్ ను మూసేసిన తరువాత, దాన్ని సీల్ చేస్తున్న క్రమంలో డోర్ తెరచుకుందని, దాన్ని పట్టుకుని ఉన్న గగనసఖి కిందపడిపోయిందని విమానయాన వర్గాలు వెల్లడించాయి. వెంటనే ఆమెను సమీపంలోని నానావతి హాస్పిటల్ కు తరలించామని తెలిపాయి. ఈ ఘటనతో విమాన ప్రయాణం దాదాపు గంట ఆలస్యమైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఇంకా స్పందించలేదు.