కాంగ్రెస్ కు షాక్... బీజేపీలో చేరిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డి!

  • లక్ష్మణ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న పద్మినీ రెడ్డి
  • మోదీపై నమ్మకంతోనే వచ్చానని వ్యాఖ్య
  • మరింతమంది రానున్నారన్న లక్ష్మణ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహకు ఆయన భార్య పద్మినీ రెడ్డి షాకిచ్చారు. ఈ ఉదయం హైదరాబాద్, బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆమె, ఆ పార్టీ నేత లక్ష్మణ్ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్నారు.

 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకంతోనే తాను బీజేపీలో చేరినట్టు తెలిపారు. మోదీ నాయకత్వంలో భారతావని ప్రగతి బాటన నడుస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా దామోదర రాజనర్సింహ ఉన్న వేళ, ఆయన భార్య ఇలా బీజేపీలో చేరడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

కాగా, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను ఆకర్షించే వ్యూహంలో భాగంగానే దామోదర రాజనర్సింహ సతీమణిని లక్ష్మణ్ స్వయంగా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. తమ పార్టీలోకి ఇంకా చాలా మంది రానున్నారని ఈ సందర్భంగా లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Damodara Rajanarsimha
Wife
Padmini Reddy
BJP
Congress

More Telugu News