పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. తన హత్యకు కుట్ర జరుగుతోందన్న జనసేనాని!
- నా హత్య కుట్ర గురించి మాట్లాడుకున్నారు
- ఆడియో టేపులు నా దగ్గరున్నాయి
- ప్రజాపోరాట యాత్ర బహిరంగ సభలో పవన్
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, ఉంగుటూరు నియోజకర్గం గణపవరం క్రాస్ రోడ్స్లో గురువారం ప్రజాపోరాట యాత్ర బహిరంగ సభలు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. తన హత్య గురించి ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్న ఆడియో టేపులు తన వద్దకు వచ్చాయన్నారు. తనను చంపేసి అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు నెట్టేసుకోవాలని చూస్తున్నాయన్నారు. దీంతో ఆ తర్వాత జనాలు కూడా ఆ విషయాన్ని మర్చిపోతారని వాళ్లు భావిస్తున్నారని పవన్ అన్నారు. తన హత్యకు కుట్ర పన్నుతున్నదెవరో తనకు తెలుసని, ఇవన్నీ తెలుసుకునే తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.