జగన్ పర్యటనకు వెళ్లరాదని మత్స్యకారుల తీర్మానం... వెళితే రూ.1 లక్ష ఫైన్!

YS Jagan Mohan Reddy Fishermen Ban Visit Fearing Fine
  • జువ్వలదిన్నెలో జగన్ పర్యటనకు వెళ్లొద్దని మత్స్యకారుల తీర్మానం
  • హాజరైన వారికి లక్ష రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరిక
  • బోట్ల వివాదం తేలే వరకు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం
  • టీడీపీ నేతలు బీదా సోదరులపై కూడా సామాజిక బహిష్కరణ విధింపు
నెల్లూరు జిల్లాలో మత్స్యకారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జువ్వలదిన్నె పర్యటనకు ఎవరూ వెళ్లకూడదని తీర్మానించారు. నిబంధన ఉల్లంఘించి వెళ్లిన వారికి ఏకంగా లక్ష రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇసకపల్లి, పట్టపుపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయించారు.

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నుంచి నాలుగు బోట్లు అదృశ్యమైన ఘటనే ఈ వివాదానికి కారణమైంది. గతంలో తమిళనాడుకు చెందిన ఆ బోట్లను అక్రమంగా చేపలను వేటాడుతున్నాయని స్థానిక మత్స్యకారులు పట్టుకుని హార్బర్‌లో ఉంచారు. అయితే ఇటీవల ఆ బోట్లు మాయం కావడంతో వివాదం మొదలైంది. ఈ బోట్ల అదృశ్యం వెనుక టీడీపీ ఎంపీ బీదా మస్తాన్ రావు, ఆయన సోదరుడు, ఎమ్మెల్యే బీదా రవిచంద్ర హస్తం ఉందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే బీదా సోదరులపై 'దురాయి' (సామాజిక బహిష్కరణ) విధించారు. వారితో మాట్లాడినా లక్ష రూపాయల జరిమానా కట్టాలని తీర్మానించారు. ఇప్పుడు తాజాగా జగన్ పర్యటనపైనా ఇదే తరహా నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. బోట్ల వ్యవహారం పూర్తిగా తేలే వరకు టీడీపీ, వైసీపీ సహా ఏ రాజకీయ పార్టీ నేతలను కలవకూడదని, వారి కార్యక్రమాలకు హాజరుకాకూడదని మత్స్యకారులు స్పష్టం చేశారు.
 
Go Back to Shorts
YS Jagan Mohan Reddy
Nellore
Fishermen
Juvaladinnepalem
Fishing Harbor
Bida Mastan Rao
TDP
YCP
Andhra Pradesh Politics

More Telugu News