కేబీసీలో గువాహటి మహిళ సంచలనం.. కోటి రూపాయలు గెలుచుకున్న వైనం!

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) 10వ సీజన్‌లో సంచలనం నమోదైంది. గువాహటికి చెందిన బినిత జైన్ అనే మహిళ ఏకంగా కోటి రూపాయలు గెలుచుకుని సంచలనం సృష్టించారు. రూ.కోటి గెలుచుకునేందుకు మొత్తం 14 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉండగా, బినిత అన్నింటికీ సరైన సమాధానాలు చెప్పి కోటి రూపాయలు ఎగరేసుకుపోయారు.

బీహార్‌లోని భాగల్పూర్‌కు చెందిన సోమేశ్ కుమార్ చౌదరి, గుజరాత్‌కు చెందిన సందీప్ అనే పోటీదారులు 13వ ప్రశ్న వరకు వచ్చి ఆగిపోయారు. ఆ  ప్రశ్నకు సమాధానం చెప్పలేక అప్పటి వరకు గెలుచుకున్న రూ.25 లక్షలతో బయటకెళ్లిపోయారు. కానీ బినిత జైన్ మాత్రం 14వ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పింది. ఆ ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం సరైనదేనని అమితాబ్ ప్రకటించగానే బినిత పట్టరాని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉద్వేగానికి గురయ్యారు. ఆమె కోటి రూపాయలు గెలుచుకున్నట్టు ప్రకటించగానే అందరూ కరతాళ ధ్వనులతో అభినందించారు.

కాగా, కోటి రూపాయలు గెలుచుకున్న బినిత ‘సప్తకోటి’ ఎపిసోడ్‌కు ఎంపికయ్యారు. అందులో ఆమె మరో ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే ఏడు కోట్ల రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంది. గత సీజన్‌లో ఏ ఒక్కరూ రూ.7 కోట్లు గెలుచుకోలేకపోయారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి బినితపై పడింది.
Go Back to Shorts
Assam
Binita Jain
KBC 10
crorepati
Guwahati
Amitabh Bachchan

More Telugu News