పవన్ మొన్నటి వరకు బాగానే ఉన్నారు.. ఆ తర్వాతే యూటర్న్ తీసుకున్నారు: చంద్రబాబు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్నమొన్నటి వరకు బాగానే ఉన్నారని, ఆ తర్వాతే ఆయనలో మార్పు వచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం కిమ్స్‌ మెడికల్‌ కాలేజీ గ్రౌండ్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన నవ నిర్మాణ దీక్షలో ఆయన మాట్లాడుతూ.. పవన్ మొన్నటి వరకు బాగానే ఉన్నారని అన్నారు.

తాను ఎప్పుడైతే బీజేపీతో విభేదించానో.. అప్పటి నుంచి యూటర్న్ తీసుకున్నారని అన్నారు. తనను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగతంగా ఆరోపణలు గుప్పిస్తున్నారని అన్నారు. తనతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరినీ వదలడం లేదని విమర్శించారు. ప్రభుత్వంపైనా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

వైసీపీ చీఫ్ జగన్ మరో అడుగు ముందుకు వేసి కులాలు, మతాలు మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వైసీపీ, బీజేపీ కలిసి చేస్తున్న ద్రోహానికి ప్రజలంతా కసితీరా ఓట్లు వేసి ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.


More Telugu News