2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: పవన్ కల్యాణ్
2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభించారు. అంతకుముందు, కవిటి మండలంలోని కాపాసుకుద్దిలో పవన్ సముద్ర స్నానం చేశారు. గంగమ్మకు ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా మత్స్యకార మహిళలు పవన్ కు ఘనస్వాగతం పలికారు. అనంతరం వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, జనసేన పార్టీకి ప్రజల సమస్యలే ఎజెండా అని, ప్రజాసమస్యలపై అవగాహన కోసమే ఈ యాత్ర ప్రారంభించాను తప్ప రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు. ఇతర రాజకీయపార్టీలతో తమ పార్టీని పోల్చవద్దని, ఇతర పార్టీల నాయకులు పదవుల కోసం తపిస్తే, తాము ప్రజా సమస్యల పరిష్కారం కోసం తపిస్తామని చెప్పారు. ఉద్ధానం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, తాము అధికారంలోకి వస్తే ఉద్ధానం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని, మరో నాలుగు నెలల తర్వాత శ్రీకాకుళం జిల్లాకు మళ్లీ వస్తానని చెప్పారు. కాగా, ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక సూరంగి రాజావారి మైదానంలో జరిగే బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు.