Pilgrim: కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన శ్రీకాకుళం, విశాఖ యాత్రికులు.. రక్షించాలంటూ వేడుకోలు!

  • బస్సులో చార్‌ధామ్ యాత్రకు బయలుదేరిన విశాఖ, శ్రీకాకుళం వాసులు
  • ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు
  • కొండపై చిక్కుకుపోయిన యాత్రికులు
  • రక్షించాలంటూ వేడుకోలు
చార్‌థామ్ యాత్రకు వెళ్లిన శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాలకు చెందిన యాత్రికులు ప్రతికూల వాతావరణం కారణంగా బద్రీనాథ్‌లో చిక్కుకుపోయారు. ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండడంతో కొండపైనే తాము చిక్కుకుపోయామని, రక్షించాలని ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరో మూడు రోజులపాటు మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తమను వీలైనంత త్వరగా రక్షించాలని వేడుకుంటున్నారు. తాము ప్రయాణించే బస్సు మంచులో కూరుకుపోయిందని, చిమ్మచీకటిలో గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

గతనెల 26న 104 మంది యాత్రికులతో కూడిన బృందం బస్సులో చార్‌ధామ్ యాత్రకు బయలుదేరింది. వీరిలో అత్యధికులు 55 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారు.  కొండపై చిక్కుకుపోయిన వారిలో 38 మంది సురక్షిత ప్రాంతాలకు చేరుకోగా 66 మంది మాత్రం బద్రీనాథ్‌లోని ఓ లాడ్జీలో తలదాచుకున్నారు. ఆపదలో ఉన్న 66 మందిలో ఆరుగురు విశాఖపట్టణం వారు ఉన్నారు. మిగతా వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు. బద్రీనాథ్‌లో విశాఖ, శ్రీకాకుళం వాసులు చిక్కుకున్న విషయం తెలిసిన వెంటనే ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ అదనపు కమిషనర్ అర్జా శ్రీకాంత్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి నౌపాడ సత్యనారాయణ రంగంలోకి దిగారు. వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సలహాలు, సూచనలు అందిస్తున్నారు. అలాగే ఉపాధి హామీ పనుల పర్యవేక్షణకు ఉత్తరాఖండ్ వెళ్లిన 39 మందితో కూడిన జెడ్పీటీసీలు, అధికారుల బృందం కూడా అక్కడ చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది.
Pilgrim
Srikakulam
Visakhapatnam
Badrinath
Kedarnath

More Telugu News