నేడే అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ రాక... షెడ్యూల్ ఇదే!

  • మధ్యాహ్నం హైదరాబాద్ రానున్న యూపీ మాజీ సీఎం
  • ఆపై ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ
  • సాయంత్రం 4.30 గంటలకు తిరుగు పయనం
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేడు హైదరాబాద్ రానున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాట్లను ముమ్మరం చేసిన వేళ, వాస్తవానికి తానే స్వయంగా లక్నో వెళ్లి అఖిలేష్ యాదవ్, ములాయం యాదవ్ లతో భేటీ అయి మాట్లాడాలని కేసీఆర్ భావించినప్పటికీ, ములాయం సూచన మేరకు అఖిలేష్, తానే హైదరాబాద్ వస్తానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు ఆయన పర్యటన నేడు ఖరారైంది. ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టునకు చేరుకునే అఖిలేష్ యాదవ్, ఆపై ప్రగతి భవన్ లో కేసీఆర్ తో సమావేశమవుతారు. ఆయనతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన తరువాత, కేటీఆర్ సహా కొంతమంది నేతలతోనూ ఆయన భేటీ అవుతారు. అఖిలేష్ యాదవ్ కు కమ్మనైన విందు ఇచ్చేందుకు ఉత్తరాది, దక్షిణాది వంటకాలను సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. ఈ భేటీల తరువాత సాయంత్రం 4.30 గంటలకు అఖిలేష్ లక్నో తిరిగి బయలుదేరుతారు. అఖిలేష్ కు స్వాగతం పలికి ప్రగతి భవన్ కు తీసుకువచ్చే బాధ్యతను కొందరు మంత్రులకు కేసీఆర్ అప్పగించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Uttar Pradesh
Telangana
Akhilesh Yadav
KCR
Hyderabad

More Telugu News