ఈ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి: కర్ణాటక వచ్చిన మోదీకి సిద్ధరామయ్య సూటి ప్రశ్న

  • కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ
  • ఇప్పటికీ యడ్యూరప్పను సీఎం అభ్యర్థిగా పరిచయం చేస్తారా?
  • మీ ర్యాలీల్లో ఆయన మీ పక్కనే ఉంటారా?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా ఐదు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య, తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శలకు దిగారు. ప్రధాని తన తొలి ర్యాలీని బీజేపీకి ఎన్నడూ మద్దతు పలకని దక్షిణ కర్ణాటకలో ప్రారంభించి, భారీ బహిరంగ సభలో ప్రసంగించనుండగా సిద్ధరామయ్య పలు ప్రశ్నలను సంధించారు. ఎన్నో స్కాముల్లో కూరుకుపోయిన యడ్యూరప్పను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారని ఆరోపిస్తూ, మీతో పాటు ర్యాలీల్లో ఆయన పాల్గొనబోవడం లేదని కొన్ని వార్తలు వచ్చాయని గుర్తు చేశారు.

ఇప్పటికీ యడ్యూరప్ప సీఎం అభ్యర్థేనా? అని సిద్ధరామయ్య ప్రశ్నించారు. తన ప్రశ్నకు సమాధానం చెప్పాలని అడిగారు. అంతకుముందు తన కుటుంబీకులకు, స్నేహితులకు టికెట్లు ఇప్పించుకున్న గాలి జనార్దన్ రెడ్డి పేరును ప్రస్తావిస్తూ, ఆయన మీ బహిరంగ సభలు, ర్యాలీల్లో ఉంటారా? అని ప్రశ్నించారు. కన్నడ ప్రజలు తమ చెవుల్లో కమలాలను పెట్టుకోలేదని నిప్పులు చెరిగారు. బీజేపీ రేపిస్టులకు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చిందని ఆరోపిస్తూ, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ఉదంతాలను ప్రస్తావించారు.
Go Back to Shorts
Narendra Modi
Siddharamaiah
Karnataka
Assembly Elections

More Telugu News