పోటీ కంపెనీలను దెబ్బతీసేందుకు జియో ఇకపైనా ధరల యుద్ధం... విశ్లేషకుల అంచనాలు
- 18.7 కోట్లకు చేరిన చందాదారులు
- మరింత మంది కస్టమర్ల ఆకర్షణకు అవసరమైతే ధరల తగ్గింపు
- విశ్లేషకుల అంచనా
రిలయన్స్ జియో టెలికం రంగంలోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చింది. ‘లేట్ గా వచ్చినా లెటెస్ట్ గానే’ అన్న రీతిలో 4జీ వోల్టే టెక్నాలజీతో అత్యధిక వేగంతో కూడిన డేటా సేవలు అందిస్తూ ప్రధాన సంస్థగా అవతరించింది. ఇప్పటి వరకు కంపెనీ చందాదారులు 18.7 కోట్లకు చేరారు. ఉన్న మార్కెట్ లోనే వాటా సొంతం చేసుకోవాలి కనుక మరింత మంది కస్టమర్లను సొంతం చేసుకునేందుకు జియో ధరల పోటీ కొనసాగిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇందుకోసం అవసరమైతే ధరల్ని ఇంకా తగ్గించడానికి కూడా జియో వెనుకాడకపోవచ్చని బీఎన్ పీ పారిబాస్ తెలిపింది. జియో స్పష్టంగా పోటీ ధరల విధానాన్ని అనుసరించడం ద్వారా చందాదారులను బాగానే ఆకర్షించిందని, ఇదే విధానం ఇక ముందూ కొనసాగుతుందని జేపీ మోర్గాన్ అంచనా. ఈ నేపథ్యంలో వచ్చే ఆరు నెలల పాటు ధరలు పెరిగే అవకాశం లేదంటున్నారు.