నాపై ఇష్టం వచ్చినట్టు రాసి.. విలన్ గా చిత్రీకరిస్తారు!: మీడియాపై గవర్నర్ విసుర్లు

ఉమ్మడి ఏపీ, ఇరు తెలుగు రాష్ట్రాల గవర్నర్ గా నరసింహన్ ఇప్పటికే 11 సంవత్సరాలపాటు సేవలందించారు. ఆయన పదవీకాలాన్ని ఇక పొడిగించకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నరసింహన్ వెంటనే హైదరాబాద్ కు తిరిగిరావడానికి ఇదే కారణమని చెబుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో నరసింహన్ తో మాట్లాడేందుకు ప్రయత్నించిన మీడియాపై ఆయన సెటైర్లు వేశారు.

తనపై ఇష్టం వచ్చినట్టు రాస్తూ, విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారని మీడియాను ఉద్దేశించి నరసింహన్ అన్నారు. 35 పేజీల నివేదికను కేంద్రానికి ఇచ్చినట్టు గతంలో రాశారని నిష్టూరమాడారు. ఇప్పటికే ఎంతోకాలం గవర్నర్ గా పని చేశానని... ఎవరైనా ఎంతకాలం పదవిలో ఉంటారు? అని ప్రశ్నించారు. తాను వెళ్లిపోయిన తర్వాత... తనంత మంచి గవర్నర్ లేడనే విషయాన్ని కూడా మీరే రాస్తారని చెప్పారు. తాను దేవాలయాలకు వెళ్లినా తప్పే అన్నట్టు వార్తలు రాస్తారని... పదవిలోకి రాకముందు కూడా దేవాలయాలకు వెళ్లడం తన అలవాటని... పదవి ముగిసిన తర్వాత కూడా తాను దేవాలయాలకు వెళతానని తెలిపారు. 


More Telugu News