టీడీపీ ఎంపీలను, కేవీపీని బుజ్జగించి పంపిన వెంకయ్యనాయుడు!

  • రాజ్యసభలో కొనసాగిన రభస
  • ప్లకార్డులతో వెల్ లో టీడీపీ ఎంపీలు
  • జత కలిసిన రామచంద్రరావు
  • వెనక్కు వెళ్లాలని బుజ్జగించిన వెంకయ్య
ఏపీ విభజన హామీల అమలు కోసం రాజ్యసభలో ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని వెల్ లోకి దూసుకెళ్లి సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్న వేళ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనదైన శైలిలో వ్యవహరించి, సభను ఆర్డర్ లో పెట్టారు. తామిచ్చిన వాయిదా తీర్మానంపై వెంటనే చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టడంతో, తన స్థానం నుంచి లేచి నిలబడిన వెంకయ్య, సభా సంప్రదాయాలను గౌరవించాలని, తానో ప్రకటన చేయాలని భావిస్తున్నానని, దాన్ని వినేందుకైనా సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని అన్నారు.

అప్పటికీ వెల్ ను ఎవరూ ఖాళీ చేయకపోవడంతో, కనీసం తన ప్రకటన పూర్తయ్యేంత వరకైనా నినాదాలు ఆపాలని కోరారు. తన వద్ద వేర్వేరు సభ్యులకు చెందిన వేర్వేరు నోటీసులు ఉన్నాయని, వాటిపై సభ దృష్టికి ఓ మాట చెప్పాలని అనుకుంటున్నానని, తాను చెప్పిన విషయం నచ్చకుంటే, ఆప్పుడు మీరు నిరసనను కొనసాగించ వచ్చని సూచించారు.

"ప్లీజ్ తెలుగుదేశం ఆల్సో... హలో... వెంకటేష్, మోహన్ రావ్, మేడమ్ ప్లీజ్... రామచంద్రరావు మీ స్థానాల్లోకి కాసేపు వెళ్లండి. కేవలం కొద్దిసేపే. కాసేపు వెనక్కు వెళ్లండి. కాసేపే..." అని బుజ్జగించడంతో ముందు టీడీపీ సభ్యులు, ఆ వెనకాలే కేవీపీ తమ స్థానాల్లోకి వెళ్లారు. ఆపై కూర్చోని కూడా కామెంట్లు ఎవరూ చేయవద్దని సూచిస్తూ తన ప్రకటనను కొనసాగించారు.
Go Back to Shorts
Venkaiah Naidu
KVP Ramachandra Rao
Rajya Sabha
TG Venkatesh

More Telugu News