మీ నీళ్లను మేం వాడుకోవచ్చా?: తెలంగాణ సాయం కోరిన కర్ణాటక!

  • తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో ఈ ఏడాది తీవ్రంగా నీటి కొరత
  • ఆర్‌డీఎస్‌లో తెలంగాణకు కేటాయించిన నీటిని తమకు ఇవ్వ‌మ‌న్న క‌ర్ణాట‌క‌
  • కేసీఆర్‌తో చర్చించిన తర్వాత తమ నిర్ణయం చెబుతామ‌న్న మంత్రి హ‌రీశ్‌రావు
తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో ఈ ఏడాది నీటి కొరత తీవ్రంగా ఉన్నందున క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం... తెలంగాణ ప్ర‌భుత్వ సాయం కోరింది. ఆర్‌డీఎస్‌లో తెలంగాణకు కేటాయించిన నీటిని తమ రాష్ట్రంలో తుంగభద్ర ఆయకట్టును కాపాడుకోవడానికి, తాగునీటి అవసరాలకు వాడుకునేందుకు అనుమతించాలని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుకు కర్ణాట‌క ఇరిగేషన్ మంత్రి పాటిల్ వినతిపత్రం సమర్పించారు. ఈ రోజు హైద‌రాబాద్‌లోని జ‌ల‌ సౌధలో ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగాయి.

తుంగభద్ర డ్యామ్ నుంచి తెలంగాణకు 3.5 టి.ఎం.సి.ల నీటి వాటా ఉందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఆర్‌డీఎస్ ఆయకట్టుకు అవసరమయ్యే నీటి వినియోగంపై, కర్ణాటకకు ఎంతమేరకు నీటి వాడకానికి అనుమతించగలమనే అంశాలపై తెలంగాణ, కర్ణాటకల మధ్య ప్రధానంగా చర్చసాగిందని చెప్పారు. ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 7 వేల ఎకరాల ఆరుతడి పంటలకు అవసరమైన సాగునీటి వాడకంపై రెండు రాష్ట్రాల ఇంజనీర్లు అంచనా వేసిన అనంతరం మిగిలిన నీటిని కర్ణాటక వాడుకునే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి హరీశ్‌ రావు కర్ణాటక ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. అంతేగాక‌, ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించిన తర్వాత తమ నిర్ణయం చెబుతామని అన్నారు. 

Telangana
Karnataka
Harish Rao
help

More Telugu News