నాటి వైస్రాయ్ ఘటనల వెనుక... ఏబీకే నోటి వెంట మైసూరా రెడ్డి చెప్పిన నిజాలు!

  • తొలుత వెంట ఉన్నది 40 మంది మాత్రమే
  • ఆపై పుకార్లు, అనుకూల మీడియా వార్తలు
  • రోజుల వ్యవధిలో పెరిగిన మద్దతుదారుల సంఖ్య
  • లక్ష్మీపార్వతంటే భయంతో రజనీకాంత్ ను దింపిన చంద్రబాబు
ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపి, తాను ఆ పదవిని తీసుకోవాలని చంద్రబాబు భావించిన వేళ, వైస్రాయ్ హోటల్ వేదికగా ఏం జరిగిందన్న విషయమై ప్రముఖ సంపాదకుడు ఏబీకే ప్రసాద్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాటి ప్రతిపక్ష నేత మైసూరా రెడ్డి తనకు స్వయంగా చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ, నాడు ఎన్టీఆర్ ను ఘోరంగా దెబ్బతీశారని అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ కుట్రదారుడు కాదు కాబట్టే, తన వెనుక జరుగుతున్న అంశాలను ఆయన గుర్తించలేకపోయారని చెప్పారు. అప్పట్లో చంద్రబాబు వద్ద 40 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని, వారితో ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టవచ్చని అప్పటి ప్రతిపక్ష నేత మైసూరా రెడ్డి వద్దకు చంద్రబాబు స్వయంగా వెళ్లి ప్రశ్నించారని ఏబీకే తెలిపారు. ఈ విషయాన్ని మైసూరా రెడ్డి తనకు చెప్పారని అన్నారు. ఆపై తనకు అనుకూల మీడియా వార్తలు, నోటి మాటలు, పుకార్ల ద్వారా వినూత్న ప్రచారం సాగించి, రోజు మారేలోపు తన వెంట ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను చంద్రబాబు పెంచుకున్నారని అన్నారు.

నాడు ఎన్టీఆర్ 'ప్రజల వద్దకు పాలన' కోసం శ్రీకాకుళం వెళ్లగా, అదే రోజు వైజాగ్ వెళ్లిన చంద్రబాబు 1200 మందికి ఫోన్ చేసి మాట్లాడారని, ఆ కాల్ లిస్టును తాను సేకరించానని అన్నారు. కుట్రలు కొందరికే సాధ్యమని, ఎన్టీఆర్ మరణానంతరం లక్ష్మీ పార్వతి ఎక్కడ బలపడుతుందోనన్న భయంతో మద్రాసు నుంచి రజనీకాంత్ ను రప్పించి ప్రచారం చేయించుకున్నారని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
ABK Prasad
Rajanikant
Chandrababu
Lakshmi Parvati

More Telugu News