పాకిస్థాన్ సైన్యం అధీనంలోకి ఇస్లామాబాద్!

  • క్షణక్షణానికీ విస్తరిస్తున్న అల్లర్లు
  • ప్రభుత్వ కార్యాలయాలన్నీ సైన్యం అదుపులోకి
  • ప్రైవేటు టీవీ చానళ్ల నిలిపివేత
  • హఫీజ్ కు మద్దతుగా నిలిచిన మత పెద్దలు
పాకిస్థాన్ లో మరోసారి రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రజాస్వామ్య పాలనకు అంతం పలికేలా, సైనిక పాలనకు తొలి అడుగుగా ఇస్లామాబాద్ ను సైన్యం తమ అధీనంలోకి తీసుకుంది. దేశంలో హఫీజ్ సయీద్ ఆగడాలు పెచ్చు మీరిపోయాయని ఆరోపిస్తూ, ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆ దేశ వాసులు డిమాండ్ చేస్తూ, ఆందోళనలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఆందోళనల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న వేళ, వేలాది మంది సైన్యం ఇస్లామాబాద్ లోకి ప్రవేశించి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలను తమ అధీనంలోకి తీసుకుంది.

మరోపక్క విమానాశ్రయం సైతం వారి అధీనంలోకి వెళ్లిపోయింది. పలు విమానాలు రద్దయ్యాయి. ప్రైవేటు టీవీ చానళ్ల ప్రసారాలను నిలిపివేశారు. రవాణా వాహనాలు తిరగక, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హఫీజ్ సయీద్ ను గృహ నిర్బంధం నుంచి విడుదల చేసిన తరువాత ఆందోళనలు పెచ్చుమీరినట్టు తెలుస్తోంది. ఆయన ప్రసంగాలతో ఓ వైపు ఆందోళనకారులు రెచ్చిపోతుండగా, మరోవైపు ప్రజలు నిరసనలకు దిగుతున్నారు. సైన్యం జరిపిన దాడుల్లో 150 మందికి పైగా గాయపడ్డట్టు సమాచారం. కాగా, న్యాయశాఖ మంత్రి దైవదూషణకు పాల్పడ్డాడని, ఆయన వెంటనే తప్పుకోవాలని హఫీజ్ డిమాండ్ చేస్తున్నాడు. ఆయనకు మద్దతుగా మత పెద్దలు రంగంలోకి దిగడంతో, పరిస్థితి మరింతగా అదుపు తప్పకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి.
Go Back to Shorts
Pakistan
hafeez saeed
military

More Telugu News