ప్రజలకు విషం పెట్టండి... ట్రక్కులు వాడి కుంభమేళాపై విరుచుకుపడండి!: సహచరులకు ఐఎస్ఐఎస్ ఆడియో సందేశం

  • త్రిసూర్ పురం వేడుకలపైనా దాడి చేయండి
  • మలయాళంలో ఆడియో క్లిప్
  • పరిశీలించిన పోలీసులు
  • ఆ గొంతు రషీద్ అబ్దుల్లాదన్న కేరళ పోలీసులు
  • నిఘా వర్గాలు అప్రమత్తం
ఇండియాలో జరిగే గంగానది కుంభమేళా, కేరళలోని త్రిసూర్ పురంలో జరిగే ఉత్సవాల్లో తాము దాడులు చేయనున్నామని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు హెచ్చరించారు. ఈ మేరకు మలయాళంలో మాట్లాడుతూ, పది నిమిషాల ఆడియో క్లిప్ ను విడుదల చేశారు. భారీగా ప్రజలు చేరే ఈ వేడుకలపై దాడులే తమ లక్ష్యమని, భారీ విధ్వంసం, జన నష్టం చేసి తీరుతామని అందులో వినిపిస్తోంది.

లాస్ వెగాస్ లో జరుగుతున్న సంగీత విభావరిపై దాడిని ప్రస్తావిస్తూ, అక్కడ భారీ ప్రాణనష్టాన్ని చూశారని, ఆ కిల్లర్ తమవాడేనని పేర్కొంది. ఇండియాలోని ఉగ్రవాదులను ప్రేరేపిస్తూ, మెదడుకు పదును పెట్టాలని, విషం కలిపిన ఆహారాన్ని ప్రజలు తినేట్టు చూడాలని, పెద్ద పెద్ద ట్రక్కులు వినియోగించి, వాటిని నిర్దాక్షిణ్యంగా ప్రజలపైకి నడిపించాలని, ప్రజలపై విరుచుకుపడాలని ఐఎస్ఐఎస్ సూచనలు ఇచ్చింది.

 రైళ్లు పట్టాలు తప్పేలా చేయాలని, కత్తులు తీసుకుని స్వైర విహారం చేయాలని చెబుతున్న ఓ పురుష గొంతుక ఈ ఆడియోలో వినిపిస్తోంది. కాగా, ఈ ఆడియోను పరిశీలించిన పోలీసులు ఆ గొంతు ఐఎస్ నేత రషీద్ అబ్దుల్లాదని తేల్చారు. ఆఫ్గనిస్థాన్ నుంచి వచ్చిన టెలిగ్రాం యాప్ లో ఈ ఆడియో వచ్చిందని తెలిపారు. అబ్దుల్లాపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఆడియోను విన్న తరువాత నిఘా వర్గాలను, పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేశామని వెల్లడించారు.
Go Back to Shorts
isis
kumbhamela
trisurpuram

More Telugu News