: భారతరత్న బిస్మిల్లా ఖాన్ షెహనాయ్ దొంగ ఆయన మనవడే... అరెస్ట్!
ప్రముఖ షెహనాయ్ విద్వాంసుడు, భారతరత్న ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షెహనాయ్ ని దొంగిలించిన కేసును పోలీసులు ఛేదించారు. ఆయన షెహనాయ్ ని దొంగిలించిన వ్యక్తి స్వయంగా ఆయన మనవడు నిజరే హసన్ అని వారణాసి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తేల్చారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు నిజరే హసన్ పై అనుమానంతో గత కొంత కాలంగా నిఘా పెట్టారు. ఆయన నగరాన్ని వదిలి పారిపోతుంటే అరెస్ట్ చేశారు.
దాదాపు 1.066 కిలోల బరువున్న ఈ షెహనాయ్ ఎంతో విలువైనదని, దాన్ని అతను కేవలం రూ. 17 వేలకు విక్రయించాడని, ఈ కేసులో మరో ఇద్దరు ఆభరణాల వ్యాపారులనూ అరెస్ట్ చేశామని తెలిపారు. చేసిన అప్పులను తీర్చేందుకే అతనీ దొంగతనం చేశాడని తెలిపారు. అతని నుంచి రూ. 4,200ను రికవరీ చేశామని, వ్యాపారులు షెహనాయ్ ని కరిగించి వెండిని తీశారని తెలిపారు. ఈ షెహనాయ్ ని మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహరావు, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్, కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబాల్ లు ఉస్తాద్ కు బహుమతిగా అందించారని తెలిపారు.