లక్షలు ఖర్చయ్యే కోర్సులు ఉచితం.. ఆపై ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగులకు అండగా 'టాటా స్ట్రైవ్'
మన ఆరోగ్యం బాగుండాలంటే రోజూ తినే ఆహారంలో ఎన్నో రకాల పోషకాలు ఉండాల్సిందే. ఆహారంలోని కార్బోహైడ్రేట్లు, కొవ్వులు శక్తినిచ్చినా.. మన శరీరంలోని అన్ని అవయవాలు సరిగా పనిచేయాలంటే విటమిన్లు, ప్రొటీన్లు, అమైనో ఆమ్లాల వంటి పోషకాలు కూడా అందాలి. వీటితోపాటు కొన్ని ఖనిజ లవణాలూ శరీరానికి అత్యవసరం. వాటిలోనూ స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు లేదా ట్రేస్ మినరల్స్ అని రెండు రకాలు.
కాల్షియం, సోడియం, పొటాషియం, క్లోరిన్ (క్లోరైడ్), మెగ్నీషియం, ఫాస్పేట్ లు స్థూల పోషకాలు. శరీరంలో ఎముకలు, కండరాలు, గుండె, మెదడుల పనితీరు స్థూల పోషకాలపై ఆధారపడి ఉంటుంది. ఇక క్రోమియం, కాపర్, ఫ్లోరైడ్, అయోడిన్, ఐరన్, మాంగనీస్, మాలిబ్డినమ్, సెలీనియం, జింక్ లు సూక్ష్మ పోషకాలు లేదా ట్రేస్ మినరల్స్. ఇందులో క్రోమియం రక్తంలో గ్లూకోజ్ స్థాయులు సాధారణంగా ఉండేందుకు తోడ్పడుతుంది. మిగతా ట్రేస్ మినరల్స్ అన్నీ శరీరంలో హార్మోన్లు, ఎంజైముల తయారీకి అవసరం. మరి ఈ ఖనిజ లవణాలు ఏమిటి, వేటి నుంచి అవి లభిస్తాయి, లోపిస్తే వచ్చే సమస్యలేమిటి, ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో తెలుసుకుందాం..
రోజూ అందాల్సిందే..
ఖనిజ లవణాలన్నీ తక్కువ స్థాయిలోనే అయినా శరీరానికి అత్యంత అవసరం. అంతేకాదు ఇవి రోజూ శరీరానికి అందాల్సిందే. లేకపోతే మనకు ఎన్నో రకాల అనారోగ్యాలు, వ్యాధులు కలుగుతాయి. సాధారణంగా ఈ ఖనిజ లవణాలన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారానే లభిస్తాయి. పోషకాహారం తీసుకునేవారిలో ఖనిజ లవణాల లోపం ఏర్పడే అవకాశం తక్కువ. కాల్షియం, అయోడిన్, ఐరన్ ల లోపం మాత్రం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అంతేగాకుండా ఎప్పుడూ ఒకే రకమైన ఆహారం తీసుకోవడం లేదా కొన్ని రకాల ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండడం వల్ల కూడా ఖనిజ లవణాల లోపం ఏర్పడుతుంది.
ఉదాహరణకు గుడ్లు, పాల పదార్థాలు, శాకాహారం మాత్రమే తీసుకునే వారిలో ఐరన్ లోపిస్తుంది. ఇక శిశువులకు ఖనిజ లవణాల అవసరం ఎక్కువ. ఎందుకంటే వారిలో పెరుగుదల వేగం ఎక్కువగా ఉంటుంది. ఖనిజ లవణాలేవైనా ఒక పరిమిత స్థాయికి మించి సప్లిమెంట్ల రూపంలో తీసుకుంటే అవి శరీరానికి విషంగా పరిణమించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వీటి లోపం ఏర్పడినవారు తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో, వారు సూచించిన మోతాదుల్లోనే వినియోగించాలి.
స్థూల ఖనిజాలు ప్రాణాధారం
ఖనిజ లవణాలు శరీరానికి ప్రాణాధారం. ఇవి కణాల లోపలి నుంచి శరీరం మొత్తం మీద వివిధ ద్రవ పదార్థాల స్థితిని కాపాడుతాయి. ఈ ఖనిజ లవణాలతో తయారయే ఎలక్ట్రోలైట్లు నాడులు, కండరాల పనితీరును నియంత్రిస్తాయి. శరీరంలో ఆమ్లయుత-క్షారయుత పరిస్థితిని సమతుల్యం చేస్తాయి. ఒకవేళ ఖనిజ లవణాల లోపం ఏర్పడితే ఎలక్ట్రోలైట్లు తగ్గిపోయి.. శరీరంలో నీటి శాతం పడిపోతుంది. కండరాలు, నాడుల పనితీరు దెబ్బతింటుంది. ఇది చివరికి మరణానికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. ఈ ఖనిజ లవణాల లోపాన్ని రక్త, మూత్ర పరీక్షల ద్వారా గుర్తించవచ్చు.
శరీరంలో ఎముకలు, దంతాలు ఏర్పడడానికి, ఎముకలు బలహీనం కాకుండా ఉండడానికి, విరిగిన ఎముకలు అతుక్కోవడానికి ఇది తోడ్పడుతుంది. గాయాలైనప్పుడు రక్తం గడ్డకట్టడానికి, కండరాల పనితీరు సరిగా ఉండడానికి కాల్షియం, గుండె సరిగా కొట్టుకోవడానికి, శరీరంలో చాలా రకాల ఎంజైములు సరిగా పనిచేయడానికి కూడా కాల్షియం అత్యవసరం. శరీరానికి తగిన మోతాదులో కాల్షియం అందకపోతే రక్తంలో కాల్షియం లోపిస్తుంది. దాంతో శరీరం ఎముకల నుంచి కాల్షియంను రక్తంలోకి తరలిస్తుంది. దీనినే ‘హైపోకాల్సిమియా’ అంటారు. దీంతో ఎముకలు బలహీన పడి ‘ఆస్టియోపోరోసిస్’ సమస్య తలెత్తుతుంది. చిన్నపాటి దెబ్బలు, ప్రమాదాలకే విరిగిపోతాయి. మనిషి శరీర బరువులో 1.5 నుంచి 2 శాతం దాకా కాల్షియం ఉంటుంది.
కణాలకు, శరీర సమతుల్యతకు సోడియం
నాడులు, కండరాలు సరిగా పనిచేయడానికి, శరీరంలో ద్రవాల సమతుల్యతకు సోడియం అత్యవసరం. రక్తంలోను, కణాల చుట్టూ ఉండే ద్రవం (ఫ్లూయిడ్)లోను సోడియం ఉంటుంది. ఇది గ్లూకోజ్, నీరు, అమైనో ఆమ్లాల రవాణాలో తోడ్పడుతుంది. సాధారణంగా సోడియం లోపం ఏర్పడడం అరుదు. శరీరం నుంచి ద్రవాలు విపరీతంగా వెళ్లిపోయే డీహైడ్రేషన్ (అతి మూత్రం, వాంతులు, విరేచనాలు, విపరీతంగా చెమట పట్టడం వంటివి), కిడ్నీలు దెబ్బతినడం, శరీరంపై తీవ్రంగా కాలిన గాయాలు కావడం వంటి పరిస్థితుల్లో శరీరంలో సోడియం లోపం ఏర్పడుతుంది. దీనివల్ల కండరాల వణుకు, బిగుసుకుపోవడం, గందరగోళం, స్పృహ తప్పిపోవడం వంటి ప్రమాదాలు ఏర్పడుతాయి. ఈ పరిస్థితి మరీ తీవ్రమైతే కోమాలోకి వెళ్లిపోతారు, మరణం కూడా సంభవించవచ్చు. ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా ఉండే ద్రవాలను తీసుకోవడం ద్వారా, సోడియం ద్రవాన్ని నరాల ద్వారా ఎక్కించడం ద్వారా లోపాన్ని అధిగమించవచ్చు. అయితే సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా సమస్యలు తలెత్తుతాయి. రక్తంలో ద్రవాల శాతం పెరిగి రక్తపోటుకు దారితీస్తుంది. గుండెపోటు, కడుపులో కేన్సర్, కిడ్నీ వ్యాధులు, కాలేయ సమస్యలు తలెత్తుతాయి.
మెదడు, కండరాల ఆరోగ్యానికి పొటాషియం
శరీరారానికి అత్యంత అవసరమైన పోషకాల్లో పొటాషియం ప్రధానమైనది. ముఖ్యంగా నాడులు, కండరాలు సక్రమంగా పనిచేయాలంటే శరీరానికి తగిన మోతాదులో పొటాషియం అందాల్సిందే. అంతేకాదు గుండె జబ్బుల నివారణ, రక్తపోటు నియంత్రణలోనూ ఇది కీలకం. ఎముకలు దృఢంగా ఉండడానికి, మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడానికి తోడ్పడుతుంది. శరీరంలో ఉండే పొటాషియంలో చాలా వరకు కణాల అంతర్భాగంలో ఉంటుంది. పొటాషియం స్థాయులు బాగా పెరిగినా.. బాగా తగ్గినా కూడా ఇబ్బందే. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదమూ ఉంటుంది. పొటాషియం లోపం వల్ల కండరాలు బలహీనమైపోతాయి. అది తీవ్రమైతే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. హైపర్ థైరాయిడిజం సమస్య తలెత్తుతుంది.
రక్తపోటు నియంత్రణకు క్లోరిన్ (క్లోరైడ్)
శరీరంలో ద్రవాల స్థితిని సమతూకంగా ఉంచేందుకు క్లోరైడ్ అత్యవసరం. అంతేగాకుండా కండరాల పనితీరుకు, రక్త పోటును నియంత్రణలో ఉంచడానికి ఇది తోడ్పడుతుంది. అయితే సాధారణంగా క్లోరైడ్ లోపం ఏర్పడడం చాలా అరుదు. ఎందుకంటే మనం నిత్యం ఉపయోగించే అన్ని రకాల ఆహార పదార్థాల్లోనూ ఉప్పును వినియోగిస్తాం. దాని నుంచి తగిన మోతాదులో క్లోరైడ్ అందుతుంది.
ఎదుగుదలకు తోడ్పడే మెగ్నీషియం
శరీరంలో ఎముకలు, దంతాల నిర్మాణానికి.. నాడులు, కండరాల పనితీరు సరిగా ఉండడానికి మెగ్నీషియం అత్యవసరం. ముఖ్యంగా శరీరంలో వివిధ అవయవాలు విడుదల చేసే ఎంజైములు క్రియాశీలం కావడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. తద్వారా శరీరం ఎదుగుదలకు తోడ్పడుతుంది. పోషకాహార లోపం, కిడ్నీ, పెద్ద పేగుల వ్యాధులు, ఆల్కాహాల్ విపరీతంగా తీసుకోవడం, డయేరియా, హైపర్ థైరాయిడిజం, కొన్ని రకాల మందుల వినియోగం కారణంగా మెగ్నీషియం లోపం ఏర్పడుతుంది. దీనిని హైపోమెగ్నీషీమియా అంటారు. దీనివల్ల ఆకలి మందగించడం, వికారం, నిద్రలేమి, శారీరక బలహీనత, వణుకు వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక శరీరంలో మెగ్నీషియం స్థాయులు పెరగడాన్ని హైపర్ మెగ్నీషీమియా అంటారు. చాలా అరుదుగా కనిపించే ఈ సమస్య కిడ్నీలు చెడిపోవడం, మెగ్నీషియం అధికంగా ఉండే లవణాలు ఎక్కువగా తీసుకోవడం, యాంటాసిడ్లు అధికంగా తీసుకోవడం వల్ల తలెత్తుతుంది. దీనికారణంగా శారీరక బలహీనత, రక్తపోటు పడిపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు గుండె పనితీరు దెబ్బతింటుంది.
డీఎన్ఏను తయారుచేసే ఫాస్పరాస్ (ఫాస్పేట్)
శరీరంలో కణాల నిర్మాణంలో ఫాస్పరాస్ (శరీరంలో ఇది ఆక్సిజన్ తో కలసి ఫాస్పేట్ రూపంలో ఉంటుంది) అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. కణాల అంతర్భాగంలో ఉండే డీఎన్ఏ, ఆర్ఎన్ఏ సహా దాదాపు అన్ని న్యూక్లిక్ యాసిడ్ ల తయారీలో, కణ పదార్థం తయారీలో ఇది కీలకం. ఇక శరీరంలో శక్తి ఉత్పాదనకు తోడ్పడేది ఫాస్పేటే. ఎముకలు, దంతాల నిర్మాణానికి ఇది అవసరం. పోషకాహార లోపం, విపరీతంగా ఆల్కాహాల్ తీసుకోవడం, హైపర్ థైరాయిడిజం, డయేరియా, అల్యూమినియం ఉండే యాంటాసిడ్లను ఎక్కువ కాలం వినియోగించడం, కాలిన గాయాలు వంటి పరిస్థితుల్లో ఫాస్పేట్ లోపం ఏర్పడుతుంది. దీనినే హైపో ఫాస్పోటేమియా అంటారు. దీనివల్ల ఆకలి మందగించడం, ఎముకలు గుల్లబారి చిన్న దెబ్బకే విరిగిపోవడం వంటి సమస్యలు వస్తాయి. లోపం తీవ్రమైతే కండరాల బలహీనత, స్పృహ కోల్పోవడం, కోమాలోకి వెళ్లడం, చివరికి మరణం కూడా సంభవించే అవకాశముంటుంది. ఇక పారాథైరాయిడ్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోవడం, కిడ్నీ సమస్యలు, డయాలసిస్ చేయించుకోవడం, ఇన్ఫెక్షన్లకు లోనైనప్పుడు శరీరంలో ఫాస్పేట్ స్థాయిలు పరిమితికి మించి పెరుగుతాయి. దీనినే హైపర్ ఫాస్పోటేమియా అంటారు. శరీరంలో అధికంగా చేరే ఫాస్పేట్ కాల్షియంతో కలసి స్పటికాలను ఏర్పరుస్తుంది. ముఖ్యంగా రక్త నాళాల్లో ఇవి ఏర్పడడం వల్ల నాళాలు గట్టిపడడం, మూసుకుపోవడం వంటివి జరుగుతాయి. దీంతో గుండెపోటు, మెదడు వంటి అవయవాలు దెబ్బతినడం జరుగుతుంది.