నాయి బ్రాహ్మణులకు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. అధికారులతో తెలంగాణ సీఎస్ సమీక్ష

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాయి బ్రాహ్మణుల, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై అధికారులతో బిఆర్ కెఆర్ భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ పథకం కింద ఇప్పటి వరకు 28550 మంది ధరఖాస్తు చేసుకోగా 10637 ధరఖాస్తులు రజకుల కమ్యూనిటీ నుండి, 17913 ధరఖాస్తులు నాయిబ్రాహ్మణుల కమ్యూనిటీ నుండి స్వీకరించడం జరిగింది. ఈ పథకానికి లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి జిల్లా కలెక్టర్లు, బీసీ సంక్షేమ అధికారులు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించాలని ఆదేశించారు. లబ్ధిదారులు తమ ధరఖాస్తులను ఉచితంగా మీ సేవా కేంద్రాలలో నమోదు చేసుకునేలా సౌకర్యాన్ని కల్పించాలని ఐటీ అధికారులను ఆదేశించారు.

సిజిజి లో రిజిష్ట్రరు చేసుకున్న ధరఖాస్తులను సంబంధిత అధికారులు వెంటనే సంబంధిత డిస్కామ్ లకు పంపించి ఉచిత విద్యుత్ పథకాన్ని పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం జివో. ఎంస్. నెం. 2, తేది 04-04-2021 బీసీ వెల్పేర్ (డి) డిపార్ట్ మెంట్ ద్వారా జారీ చేయడంతో పాటు నియమనిబంధనలు కూడ విడుదల చేసింది.

ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణారావు, బీసీ వెల్ఫేర్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ రఘునందన్ రావు, టీఎస్ఎస్పీడీసీఎల్, సీఎండీ రఘుమారెడ్డి, బీసీ వెల్ఫేర్ అడిషనల్ సెక్రటరీ సైదా, వాషర్ మెన్ ఎండీ చంద్రశేఖర్, నాయి బ్రాహ్మణ్ ఎంసి. విమల మరియు తదతర అధికారులు పాల్గొన్నారు.

More Press News