గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాల సృష్టికి టెక్నాలజీ ఇంక్యుబేటర్స్ ఉపయుక్తం: ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్

విజయవాడ, ఫిబ్రవరి 05: ఇంక్యుబేషన్ సెంటర్‌ల ఏర్పాటు చేయడం ద్వారా టెక్నాలజీ ఆధారిత స్టార్టప్‌లకు పూర్తి సహాకారం అందించటం సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వినూత్న ఆలోచనల అంకురార్పణకు ఇంక్యుబేషన్ సెంటర్లు ఉపయోగపడతాయని, ఫలితంగా సుస్ధిర సంస్ధల ఏర్పాటు సాధ్యమవుతుందని అన్నారు.

నరసరావు పేట ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్ర టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ సెంటర్ శంఖుస్దాపనలో భాగంగా విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ వీడియో సందేశం ఇచ్చారు. భారత ప్రభుత్వ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ బోర్డ్ పరిధిలోని ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డివిజన్‌, జెఎన్ టియు కాకినాడ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కేంద్రానికి రూపకల్పన చేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశంలో కొత్త స్టార్టప్‌లు వృద్ధి చెందడానికి కేంద్రం ఇటీవల రూ.1000 కోట్ల నిధిని ప్రారంభించిందని, యువత పారిశ్రామికవేత్తలుగా మారడానికి ప్రభుత్వం స్టార్టప్ వ్యవస్థను పాదుకొలపటానికి అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆంధ్ర టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, క్లీన్-టెక్, ఎనర్జీ, వాటర్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి)పై దృష్టి సారించి ఉద్యోగాల కల్పన, కొత్త టెక్నాలజీతో ఇన్నోవేషన్ ఆధారిత స్టార్టప్‌లను ప్రోత్సహిస్తుందన్న ఆశాభావాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు.

More Press News