చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేటలో నిజాం ప్రభుత్వ హయాంలో నిర్మించిన మెట్ల బావిని మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, సహిత స్వచ్చంద సంస్థ నిర్వహకురాలు కల్పనా రమేష్ లతో కలిసి పరిశీలించారు.

ఎంతో పురాతనమైన మెట్ల బావి కోనేరు 30.5 మీటర్ల పొడవు, 19.2 ఫీట్ల వెడల్పు, 53 అడుగుల లోతు కలిగి ఉంది. ఈ బావి పూర్తిగా చెత్త, వ్యర్దాలతో పూడిపోగా 6 నెలల పాటు శ్రమించి సహిత స్వచ్చంద సంస్థ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 2 వేల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించడం జరిగింది. ఈ బావికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకునేందుకు ఈ రోజు బావిని పూర్తిస్థాయిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ లు తిరిగి పరిశీలించారు. బావిలోని చెత్త తొలగింపుకు ముందు ఉన్న పరిస్థతి, ప్రస్తుత పరిస్థితులను వివరించేలా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్ కు చారిత్రక నగరంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, అనేక పురాతన కట్టడాలు ఈ నగరంలో ఉన్నాయని వివరించారు. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాలను పరిరక్షించి వాటికి పూర్వ వైభవం తీసుకు రావాలని ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశించారని తెలిపారు. అప్పటి ఈ ప్రాంత ప్రజల అవసరాల కోసం 17వ దశాబ్దంలో బన్సీలాల్ పేటలో ఈ మెట్ల బావిని నిర్మించినట్లు తెలిపారు.

ఈ బావిని ఆగస్టు 15 వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్ది చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. అంతేకాకుండా ఈ బావికి సంబంధించిన చరిత్ర ఇక్కడికి వచ్చే ప్రజలకు తెలిసేలా పూర్తి సమాచారాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామని చెప్పారు. స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ మాట్లాడుతూ నగరంలో ఉన్న పురాతన కట్టడాలను గుర్తించి వాటి పునరుద్దరణ, పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశించారని తెలిపారు.

అందులో భాగంగా ఇప్పటికే మోజం జాహి మార్కెట్ ను అభివృద్ధి చేయడం జరిగిందని, త్వరలోనే మోండా మార్కెట్, మీరాలం మండి, సర్దార్ మహల్ తదితర పురాతన నిర్మాణాలను పునరుద్దరించనున్నట్లు తెలిపారు. నగరంలో ఇలాంటి బావులు 44 వరకు ఉండగా, ఇప్పటికే బన్సీలాల్ పేటతో సహా ఆరు బావుల పునరుద్దరణ పనులు చేపట్టడం జరిగిందని, వీటిలో బాపూఘాట్, గచ్చిబౌలి, సీతారాం బాగ్, గుడి మల్కాపూర్, శివంబాగ్ లు ఉన్నాయని చెప్పారు. మరో 20 బావుల పునరుద్దరణ పనులను త్వరలోనే చేపట్టనున్నట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుంద రెడ్డి, ఆర్డీఓ వసంత, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిస్టోఫర్, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, ట్రాన్స్ కో డీఈ శ్రీధర్, ఈఈ సుదర్శన్ తదితరులు ఉన్నారు.

గాంధీ విగ్రహం పరిసరాల సుందరీకరణ: మంత్రి తలసాని

సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ లో గల ఎంజీ రోడ్ లోని గాంధీ విగ్రహం పరిసరాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. గురువారం గాంధీ విగ్రహం పరిసరాలను మంత్రి శ్రీనివాస్ యాదవ్ మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న గాంధీ విగ్రహానికి పక్కనే నూతనంగా మరో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా ప్రస్తుతం అక్కడ ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లను వేరొక చోటకు తరలించాలని ట్రాన్స్ కో ఎస్ఈ రవీందర్ ని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న స్థలానికి అదనంగా పక్కనే ఉన్న స్థలాన్ని కూడా వినియోగంలోకి తీసుకొని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. గాంధీ విగ్రహం పరిసరాల అభివృద్దికి రూపొందించిన నమూనాను జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మంత్రికి చూపించి వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీ ముకుంద రెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిస్టోఫర్, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, ట్రాన్స్ కో డీఈ శ్రీధర్, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి తదితరులు ఉన్నారు.

More Press Releases