బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: వచ్చే నెల 13వ తేదీన బల్కంపేటలోని ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఆర్ & బీ, హెల్త్, పోలీస్, ఎలక్ట్రికల్ తదితర శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా అమ్మవారి కళ్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశించారని తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

జులై 12వ తేదీన ఎదుర్కోళ్ళు, 13వ తేదీన అమ్మవారి కళ్యాణం, 14వ తేదీన రధోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. కోవిడ్ ను దృష్టిలో ఉంచుకొని అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి తోపులాటకు గురికాకుండా భారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్ & బీ అధికారులను ఆదేశించారు.

అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రముఖుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఆలయానికి వచ్చే రహదారులు, రధోత్సవం నిర్వహించే రహదారుల మరమత్తులను వెంటనే చేపట్టాలని జోనల్ కమిషనర్ ప్రావిణ్యను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య నిర్వహణ, శానిటైజేషన్ చేపట్టాలని, అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని ఆమెను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.

మొబైల్ టాయిలెట్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ అధికారులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. మొబైల్ ట్రాన్స్ పార్మర్ లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, రంగురంగుల విద్యుత్ దీపాలతో అమ్మవారి ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.

ఆలయ పరిసరాలలోని అన్ని స్ట్రీట్ లైట్స్ వెలుగుతున్నాయా, లేదా ఒకసారి చెక్ చేసి అవసరమైన చోట్ల లైట్స్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. అమ్మవారి కళ్యాణ ఉత్సవాల ప్రారంభం నుండి ముగిసే వరకు నీటి సరఫరా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. భక్తులకు పంపిణీ చేసేందుకు లక్ష వాటర్ ప్యాకెట్స్ ను సిద్దంగా ఉంచుకోవాలని వాటర్ వర్క్స్ అధికారులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. క్యూ లైన్ లో వచ్చే భక్తులకు వాటర్ వర్క్స్ సిబ్బంది ద్వారా వాటర్ ప్యాకెట్స్ ను పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

భక్తులకోసం పలు స్వచ్చంద సంస్థలు ఏర్పాటు చేసే అన్నదాన కార్యక్రమాలకు అవసరమైన సహకారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ పరిసరాలలో ఎలాంటి డ్రైనేజి లీకేజీలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. దొంగతనాలు, ఈవ్ టీజింగ్ వంటి చర్యల నియంత్రణపై నిఘా ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కోరారు. అవసరమైన ప్రాంతాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మూడు రోజుల పాటు స్వచ్చందంగా భక్తులకు సేవలందించే వాలంటీర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులను బార్ కోడింగ్ తో పంపిణీ చేయాలని ఆదేశించారు.

మూడు రోజుల పాటు ఆలయ పరిసరాలలో భక్తుల రాకపోకలు ఉంటాయని, ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టి ప్రజలు, వాహనదారులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని ట్రాఫిక్ పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. ఆర్ & బీ అధికారుల సహకారంతో ట్రాఫిక్ డైవర్షన్ కోసం అవసరమైన రహదారులలో భారికేడ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. భక్తులకు వైద్య సేవలను అందించేందుకు ఆలయ పరిసరాలలో మూడు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్ ను ఆదేశించారు.

ఈ సమావేశంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, ఈఓ అన్నపూర్ణ, కల్చర్ డైరెక్టర్ హరికృష్ణ, డీసీ వంశీ, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్, ట్రాపిక్ అడిషనల్ డీసీపీ భాస్కర్, ఆర్ & బీ ఈఈ శ్రీనాథ్, ట్రాన్స్ కో డీఈ నెహ్రూ నాయక్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ యుగంధర్, ఆర్డీఓ వసంత కుమారి, సమాచార శాఖ ఇంజనీర్ రాధాకృష్ణ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Press Releases