ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. జలవివాదాలపై కేంద్ర మంత్రితో కీలక భేటీ

Chandrababu Naidu to Visit Delhi for Key Meeting on Water Disputes
  • కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ప్రత్యేకంగా భేటీ
  • గోదావరి జలాల సమీక్షకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని వినతి
  • సమ్మక్క సారలమ్మ, ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలని విజ్ఞప్తి
  • సీఐఐ వార్షిక సమావేశంలో కూడా పాల్గొననున్న సీఎం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఎల్లుండి (ఈ నెల 11న) ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవివాదాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నారు. ముఖ్యంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు. అదే సమయంలో గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.

మరోవైపు కృష్ణా నదిపై కర్ణాటక నిర్మించిన ఆల్మటి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిలువరించాలని కూడా కేంద్ర మంత్రిని చంద్రబాబు అభ్యర్థించనున్నారు. వీటితో పాటు ఢిల్లీలో జరిగే భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సమావేశంలో పాల్గొని ఆయన ప్రసంగిస్తారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.
Go Back to Shorts
Chandrababu
AP CM
Andhra Pradesh
Jal Shakti Ministry
Godavari River
Krishna River
Polavaram Project
Telangana
Karnataka
Water Disputes

More Telugu News