విధులకు గైర్హాజరు.. 51 మంది వైద్యులపై ఏపీ సర్కార్ వేటు

Satya Kumar Yadav AP Govt Sacks 51 Doctors for Unauthorized Absence
  • ఏపీలో 51 మంది ప్రభుత్వ వైద్యులను శాశ్వతంగా తొలగించిన ప్రభుత్వం
  • ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా గైర్హాజరు కావడమే కారణం
  • తొలగించిన వారిలో 8 మంది అసోసియేట్, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు
  • మరో 33 మంది వైద్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేశామన్న మంత్రి సత్యకుమార్
  • బాధ్యతారాహిత్యం సహించేది లేదని వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి విధులకు అనధికారికంగా గైర్హాజరవుతున్న 51 మంది వైద్యులను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగించింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రోగులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో ప్రభుత్వం ఈ కఠిన చర్యలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు.

డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని వివిధ ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న వారిపై ఈ చర్యలు తీసుకున్నారు. తొలగించిన వారిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉన్నారు. వీరిలో కొందరు ఆరు నుంచి ఏడు సంవత్సరాలుగా విధులకు రాకుండా, ప్రైవేటు పనుల్లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (ప్రవర్తనా నియమాలు)-1964 ప్రకారం షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వీరితో పాటు, ఏడాదిలోపు గైర్హాజరైన మరో 33 మంది వైద్యులకు ఛార్జ్ మెమోలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. వీరిలో 11 మంది ఇప్పటికే తిరిగి విధుల్లో చేరారని, మిగిలిన వారు నిర్దేశిత గడువులోగా హాజరుకాకపోతే వారిని కూడా తొలగిస్తామని హెచ్చరించారు. "విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించే ప్రసక్తే లేదు" అని మంత్రి సత్య కుమార్ స్పష్టం చేశారు.
 
Go Back to Shorts
Satya Kumar Yadav
AP Government
Andhra Pradesh Doctors
Absentee Doctors
Medical Education
Government Hospitals
Doctor Dismissal
Health Department AP
AP Civil Services Rules

More Telugu News