వైసీపీ నేత పూడి శ్రీహరికి కుప్పం కోర్టు బెయిల్
- చంద్రబాబు మార్ఫింగ్ ఫొటోలు, అసభ్యకర పోస్టుల కేసు
- శ్రీహరికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు
- బెంగళూరులో శ్రీహరిని అరెస్ట్ చేసిన పోలీసులు
మాజీ సీఎం జగన్ సీపీఆర్వో, వైసీపీ నేత పూడి శ్రీహరికి కుప్పం కోర్టులో ఊరట లభించింది. బెంగళూరులో అరెస్ట్ అయిన ఆయనను పోలీసులు ఈ రోజు ఉదయం కుప్పం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.
కేసు వివరాల్లోకి వెళితే... ముఖ్యమంత్రి చంద్రబాబుకి సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకర పోస్టుల వ్యవహారంలో శ్రీహరిపై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నాయకుడు వినోద్ కుమార్ మూర్తి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రారంభమైన ఈ కేసులో, గత కొన్ని రోజులుగా హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ తిరిగిన వివాదం చివరకు కుప్పం కోర్టులో బెయిల్తో ముగిసింది.
పోలీసుల కస్టడీ అభ్యర్థనను తోసిపుచ్చుతూ, ఆయనకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో, బెంగళూరులో ఉన్న శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుప్పంకోర్టులో ఆయనను ప్రవేశపెట్టగా బెయిల్ మంజూరు చేసింది.
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపుతామని కూటమి ప్రభుత్వం ఇటీవల సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తున్నారని అధికార పక్షం ఆరోపిస్తుంటే... ఇదంతా రాజకీయ కక్షసాధింపు చర్యలని విపక్షం వాదిస్తోంది.